రవీంద్రభారతి/కొండాపూర్/ఉప్పల్, ఏప్రి ల్ 9: శ్రీ క్రోధి నామ సంవత్సరాది ఉగాది వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమార్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, సమాచార, పౌర సంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ హన్మంతరావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాచుపల్లి సంతోష్కుమార్ శాస్త్రి శ్రీక్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించి పంచాంగ పఠనం చేశారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు మేలు కలగాలని, ప్రజలందరికి కొత్త ఆశయాలు నెరవేరి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి జీవితంలోని అనేక అనుభవాలకు ప్రతీకని, జీవితంలో ఎదురయ్యే అనేక అనుభావాలను ఎదుర్కోని ముందుకెళ్లాలని ఇది సూచిస్తుందన్నారు. రైతు కుటుంబాల్లో వసంతాలు తెచ్చి పున్నమి వెన్నలను నింపమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అనంతరం సంతోష్కుమార్ శాస్త్రిని మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా సన్మానించారు.