Book Fair | సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : 36వ హైదరాబాద్ జాతీయ పుస్తకాల ప్రదర్శన ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం నుంచి కొలువుదీరనున్నది. లక్షలాదిగా పుస్తక ప్రేమికులు తరలొచ్చే ఈ బుక్ ఫెయిర్లో 365 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పుస్తక ప్రదర్శన సాయంత్రం 5 గంటలకు ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని తెలిపారు.
ఆత్మీయ అతిథులుగా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామ్ అయ్యర్, విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పద్మశ్రీ కూరెళ్ల విఠలాచార్య, తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, విమలాగద్దర్ పాల్గొంటారని తెలిపారు. జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి పుస్తక ప్రదర్శనలను సాధనాలుగా తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు పుస్తక ప్రదర్శన ఉంటుందని చెప్పారు. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజాయుద్ధనౌక గద్దర్ పేరును, వేదికకు సంస్కృతం పండితుడు రవ్వా శ్రీహరి పేర్లను నామకరణం చేస్తున్నట్టు చెప్పారు.
ద్వారానికి ఉర్దూ దినపత్రిక సియాసత్ మాజీ యండీ జహీరుద్దీన్ అలీఖాన్ పేరు పెడుతున్నట్టు తెలిపారు. పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపాన్ని పెడుతున్నామని చెప్పారు. ఓ స్టాల్కు ఇటీవల మరణించిన జర్నలిస్టు నర్సింగ్ రావు పేరు నామకరణం చేసినట్టు వివరించారు. బాలప్రపంచం పేరుతో పిల్లలకు పెయింటింగ్, క్విజ్, సంగీతం తదితర పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పిల్లలకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు ఉచిత ప్రవేశం ఉంటుందని చెప్పారు. అనంతరం హెచ్బీఎఫ్ కార్యదర్శి ఆర్.వాసు మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా నిర్వహణకు సరిపడా బడ్జెట్ లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, కోయ చంద్రమోహన్, సంయుక్త కార్యదర్శి శోభన్ బాబు, కార్యవర్గ సభ్యులు సూరిబాబు, బాల్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.