హయత్నగర్, సెప్టెంబర్ 22: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని.. ఇందులో భాగంగానే పాడి ఉత్పత్తుల ప్రోత్సాహానికి పెద్దపీట వేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. బుధవారం హయత్నగర్లోని మదర్ డెయిరీలో నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం డైరెక్టర్ల ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి జగదీశ్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘంలో ప్రతి సంవత్సరం ఖాళీ అవుతున్న మూడు డైరెక్టర్లతో పాటు గతేడాది జరగాల్సిన మరో మూడు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.
దాదాపు కోటిన్నర లక్షల ఎకరాలకు పైగా సాగు చేసుకునే వీలున్న తెలంగాణలో పాడి ఉత్పత్తులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నా ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు పాడి ఉత్పత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వంతో కలిసి వచ్చే పాలక వర్గాన్ని ఎన్నుకుంటే నార్ముల్ డెయిరీ అభివృద్ధికి మరింత తోడ్పాటు అందడం ఖాయమన్నారు.
13 సంవత్సరాలుగా మదర్ డెయిరీ చైర్మన్గా గుత్తా జితేందర్రెడ్డి విశేష సేవలందిస్తున్నారని తెలిపారు. అయితే ఈ సంవత్సరం జరిగే చైర్మన్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కొంతకాలం పార్టీకి సేవలందించేందుకు ఆయన ముందుకు రావడం అభినందనీయమన్నారు. పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించేందుకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు.
నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం చైర్మన్గా 13 సంవత్సరాలు.. డైరెక్టర్గా 21 సంవత్సరాలు సంస్థకు సేవలందించానని మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి తెలిపారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు ఈ సంవత్సరం జరిగే చైర్మన్ స్థానానికి పోటీ చేయడం లేదని.. పార్టీ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని వివరించారు.
ఐదు సంవత్సరాల క్రితం మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో టీఆర్ఎస్లోకి వచ్చానని.. మదర్ డెయిరీ సంస్థ చైర్మన్గా కొనసాగుతున్న కాలంలో మంత్రి అందించిన కృషి మరువలేనిదని అన్నారు. రైతులు, ఉద్యోగులు సంస్థకు రెండు కండ్ల లాంటి వారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రైతు అభివృద్ధి ఖాయమన్నారు. కార్యక్రమంలో నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిశోర్, కంచర్ల భూపాల్రెడ్డి, ఏఎల్డీఏ చైర్మన్ పిచ్చిరెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మదర్ డెయిరీ సంస్థ డీజీఎం కృష్ణ పాల్గొన్నారు.