హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్వి సప్తాహ వేడుల్లో భాగంగా ఈ నెల 21న చేపట్టిన ప్రత్యేక హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వాములవ్వాలని మంత్రి కోరారు. ప్రపంచంలో వినూత్నంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫాలితాలనిస్తున్నది. రాష్ట్రంలో గ్రీనరీ 7.7శాతం పెరిగిందని, కోట్లాది మొక్కలు నాటిన ఫలితంగా పర్యావరణం కూడా పరిరక్షించబడి వర్షాలు సమయానుకూలంగా బాగా కురుస్తున్నాయని మంత్రి తెలిపారు.
ఈ నేపథ్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్వి సప్తాహ వేడుకలు రావడం, ఈ అద్భుత అవకాశాన్ని తీసుకుని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, వాటిని సంరక్షించాలని మంత్రి కోరారు. ఇందుకు తగ్గట్లుగా జిల్లా కలెక్టర్లు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, వారి వారి నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు.