సికింద్రాబాద్, ఆగస్టు 4: ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు, సన్మార్గంలో నడిపించేందుకు మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామి ఉద్బోధించారు. సీతాఫల్మండి డివిజన్ శ్రీనివాసనగర్లోని శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ శిలాన్యాస కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి ప్రతిష్ఠించిన అతి తక్కువ ఆలయాల్లో శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ఒకటని, పునర్నిర్మాణం తన చేతుల మీదుగా జరగడం భగవంతుని సంకల్పమన్నారు. పాదుక కానుకను స్వీకరించిన విద్యా శంకర భారతి స్వామి పుష్పగిరి పీఠం తరుపున దేవాలయ అభివృద్ధికి విరాళంగా అందించడం విశేషం. దేవాదాయ శాఖ, పశు సంవర్ధక శాఖ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్లు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రెండేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు ఆలయ ఈఓ రాజేష్ కుమార్, కమిటీ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్లు వివరించారు. శారదపీఠం ఆస్థాన విద్వాంసులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, సంస్కృత పండితులు దుర్బల ప్రభాకర శర్మలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త, డిప్యూటీ కమిషనరు రామకృష్ణ రావు, సహాయ కమిషనర్ కృష్ణ, దేవాదాయ శాఖ స్తపతి వల్లినాయకం, ఈఈ మల్లికార్జునరెడ్డి, డీఈ పాండు రంగ విఠల్, ఇన్స్పెక్టర్ శ్రీదేవి, స్థానిక కార్పొరేటర్ సామల హేమ, బేగంపేట కట్ట మైసమ్మ ఆలయ ఈఓ అంబుజ, కార్యదర్శి ఆత్మారామసూర్యసుబ్రహ్మాణ్యం, కోశాధికారి బాలభాస్కర్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు వేణుగోపాలరావు, లక్ష్మీనారాయణ, శివశంకరన్, కేజీ నారాయణన్, సుజయ్ప్రకాశ్, మూర్తిసుబ్రహ్మణ్యం, ఉమేష్, గాయత్రి, వెంకట రాధాకృష్ణలతోపాటు భక్తులు, ఆథ్మాత్మికవేత్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.