సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిముషాలపాటు దోమల నివారణ కార్యక్రమం’లో ఆయన పాల్గొన్నారు. కోకాపేటలోని తన ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని, చెత్తను స్వయంగా తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని చెప్పారు.
ప్రతి ఒకరూ ఆదివారం 10 నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధిచెంది వ్యాధు లు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. డెంగీ, మలేరియా లాంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే అందరూ దోమల నివారణకు కృషి చేయాలని సూచించారు. చికిత్స కన్నా నివారణే ముఖ్యమన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని, వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం మన చేతుల్లోనే ఉన్నదని తెలిపారు. వీధులను మున్సిపల్, గ్రామ పంచాయతీల్లోని సిబ్బంది శుభ్రం చేస్తున్నారని, మన ఇంటి పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలన్నారు. వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల నియంత్రణకు వైద్యారోగ్య శాఖ అన్నివిధాలా సిద్ధంగా ఉన్నదని, దవాఖానల్లో అవసరమైన టెస్టింగ్ కిట్లు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.