మణికొండ, డిసెంబర్ 19 : ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ… ప్రజలకు చేరువలో బస్తీ దవాఖానలు నిర్మించి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. రోగాలను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందించగలిగితే అవి ప్రాణాంతకం కాకుండా అడ్డుకోవడం సాధ్యమన్నారు. అలాగే ఆరోగ్యంపై పేదలకు సరైన అవగాహన కల్పించి రోగాల బారి నుంచి రక్షణ పొందడంలో బస్తీ దవాఖానలు తోడ్పడుతాయన్నారు.
సోమవారం మణికొండ మున్సిపాలిటీ పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో బస్తీ దవాఖానను ప్రారంభించి.. స్థానిక ప్రజాప్రతినిధులకు వైద్య పరీక్షలు చేయిస్తున్న మంత్రి హరీశ్రావు, చిత్రంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ… తన నియోజకవర్గం చాలా విస్తీర్ణంతో కూడుకున్నదని మరిన్ని బస్తీ దవాఖానలను మంజూరు చేయాలని మంత్రి హరీశ్రావుకు విన్నవించారు. ఇందుకు స్పందించిన మంత్రి వీలైనన్నీ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ కె.నరేందర్రెడ్డి, మున్సిపల్ టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ కె.రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీరాములు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.