హైదరాబాద్, జనవరి 11 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యంపై మరింత శ్రద్ధ వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కొనసాగుతున్న పనులన్నీ మార్చిలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పథకాల పనితీరు, ప్రగతిపై జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఆర్డీవో, డీపీవో, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత కరోనా సీజన్లలో పంచాయతీ సిబ్బంది, అధికారులు బాగా పనిచేశారని ఆదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లేబర్ మొబిలైజేషన్, కొత్త కార్డుల జారీ అంశాలను జాగ్రత్తగా నిర్వహించాలని మంత్రి దయాకర్రావు చెప్పారు. కరోనా నేపథ్యంలో నగరాల నుంచి ప్రజలు పల్లెబాట పడుతున్నారని, వారందరికీ ఉపాధి లభించేలా చూడాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎమ్మెల్సీలు కే దామోదర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.