వానకాలం సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అధికారుల ప్రథమ ప్రాధాన్యమని ఆయన సూచించారు. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాల సన్నద్ధత కార్యక్రమాలపై జీహెచ్ఎంసీ, జలమండలి, ఇతర శాఖలతో కలిసి మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్షించారు. వరద నివారణకు నగరంలో చేపడుతున్న ఎస్ఎన్డీపీ పనులు, ఇటీవల ప్రారంభించిన వార్డు కార్యాలయ వ్యవస్థపై ఆయన సమీక్షించారు.
– సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడటమే అధికారుల ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇప్పటికే వర్షాకాల ప్రణాళికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని, నాలాల సేఫ్టీ ఆడిట్ని పూర్తి చేసినట్లు మంత్రి కేటీఆర్కు అధికారులు వివరించారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాల సన్నద్ధత కార్యక్రమాలపై జీహెచ్ఎంసీ, జలమండలి, ఇతర శాఖలతో కలిసి మంత్రి కేటీఆర్ సమీక్షించారు. వరద నివారణకు నగరంలో చేపడుతున్న ఎస్ఎన్డీపీ, ఇటీవల ప్రారంభించిన వార్డు కార్యాలయ వ్యవస్థపై సమీక్షించారు. ఇప్పటికే చేపట్టిన పనుల్లో మెజారిటీ పనులు పూర్తయ్యాయని, గత సంవత్సరంతో పోలిస్తే వరద ప్రమాదం అనేక కాలనీలకు తప్పుతుందని ఎస్ఎన్డీపీ విభాగం అధికారులు మంత్రికి వివరించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో అవసరమైన డివాటరింగ్ పంపులు, ఇతర ఏర్పాట్లు చేసుకుని సన్నద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో నీరు, ఫుల్ట్యాంక్ నిల్వలకు చేరకుండా వాటి నీటి నిల్వ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.
వార్డు కార్యాలయాల పనితీరుపై మంత్రి కేటీఆర్ ఆరా..
నగర వ్యాప్తంగా ప్రారంభించిన వార్డు కార్యాలయాల పనితీరుపై మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ ప్రారంభ దశలోనే ఉన్నదని, ఈ దశలో ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ దిశగా జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రతి రోజు వార్డు కార్యాలయ వ్యవస్థను నగర పౌరులు విస్తృతంగా వినియోగించుకునేలా ప్రయత్నాలు చేయాలన్నారు. వార్డు కార్యాలయాల వ్యవస్థ మరింతగా మెరుగుపరిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకునేలా ప్రత్యేకంగా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
వార్డు కార్యాలయాల వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న అన్ని విభాగాల అధికారులు రానున్న కొన్ని వారాల పాటు ప్రత్యేకంగా అంతర్గత సమీక్షలు నిర్వహించుకొని వార్డు కార్యాలయ వ్యవస్థ పనితీరును బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ పౌరులతో ఫోన్లో మాట్లాడారు. జీహెచ్ఎంసీకి వివిధ సమస్యలపై ఫిర్యాదు చేసిన వారికి, ఆయా సమస్యల పరిష్కారం జరిగిన తీరు ఈ విషయంలో జీహెచ్ఎంసీ నుంచి ఎదురైన అనుభవాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాల విషయంలో జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసిన తర్వాత… ఆ సమస్యను పరిష్కరించి, అందుకు సంబంధించిన ఫీడ్బ్యాక్ను తీసుకున్నట్లు గాజుల రామారానికి చెందిన రాము అనే వ్యక్తి మంత్రి కేటీఆర్కి తెలియజేశారు. మంత్రి స్వయంగా ఫోన్ చేసి ఆరా తీసిన తీరు పట్ల రాము హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీతో పాటు జలమండలి చేపట్టిన ప్రాజెక్టులు, ఉచిత నీటి సరఫరా, ఫిర్యాదుల పరిష్కారం వంటి జలమండలి కార్యక్రమాలను సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, ఈడీ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియా ఉద్దీన్, ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.