మేడ్చల్ /మేడ్చల్ రూరల్/శామీర్పేట, మే 10 : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం తూంకుంట మున్సిపాలిటీ దేవరయాంజాల్లోని ఎంఎస్ఆర్ కన్వెన్షన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 103 సీట్లను సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్ అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ లాంటి పథకాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఉన్నాయా అని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలవి బట్టేబాజ్ మాటలు తప్ప, ప్రజలకు చేసేదేమీ ఉండదని విమర్శించారు. దేశం మొత్తం బీఆర్ఎస్ వైపు, కేసీఆర్ వైపు చూస్తున్నదని, తెలంగాణ మోడల్ కావాలని కోరకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్ ప్రధాని కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీగా మారిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఒక్కో కౌన్సిలర్ పరిధిలో రూ.3 కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయన్నారు.
కండ్లకోయ నుంచి బైక్ ర్యాలీ
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి కండ్లకోయ నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్పై ర్యాలీగా వచ్చారు. బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కందాడి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.