కీసర, నవంబర్ 27: ఈ నెల 30న జరగనున్న మేడ్చల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండలంలోని తిమ్మాయిపల్లి, నర్సంపల్లి తదితర గ్రామాల్లో సోమవారం మంత్రి చామకూర మల్లారెడ్డి భారీ రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
మన సీఎం కేసీఆర్ 10 ఏండ్లల్లో వందేళ్ల అభివృద్ధి చేశాడన్నారు. మన సీఎం కేసీఆర్ అమలు చేసిన ప్రభుత్వ పథకాలు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయన్నారు. ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే పథకాలని, ప్రతి ఇంటికి ఏదో రకంగా లబ్ధి చేకూరుతుందన్నారు. మేడ్చల్లో తను చేసిన అభివృద్ధి పథకాలే తన గెలుపునకు విజయ సోపానాలు అవుతాయన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగానే కాకుండా స్వచ్ఛందంగా కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా పోతుందన్నారు. ఈ కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఆపూర్వ స్పందన లభించింది. పలు గ్రామాల నుంచి కూడా కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మంత్రి వారికి కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు పిడిచుట్టి పెంటయ్య, సత్తమ్మ, తిమ్మాయిపల్లి ఎంపీటీసీ కందాడి ప్రమీల అమరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.