కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్
ఘనంగా ఈఎస్ఐసీ ఎంబీబీఎస్ స్నాతకోత్సవం
వెంగళరావు నగర్/ అమీర్పేట్, జూన్ 18: వైద్యు డు దేవుడితో సమానమని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మం త్రి భూపేందర్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐసీ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్(2016-17)బ్యాచ్ స్నాతకోత్సవాన్ని శనివారం శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ సహాయక మంత్రి రామేశ్వర్ తెలి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ దేవుడు ప్రాణం పోస్తే.. ఆ ప్రాణాలు నిలబెట్టే సత్తా వైద్యులకే ఉందన్నారు. వైద్య వృత్తి.. పవిత్రమైంది అని సమాజంలో వైద్యుడంటే ఎంతో గౌరవం ఉందని అన్నారు. వైద్య వృత్తిని సేవా దృక్పథంతో చేస్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువ వైద్యుల చేతిలో ఉందని, ప్రజలకు నేరుగా సేవచేసే అవకాశం ఒక్క వైద్యులకే ఉందన్నారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన కష్టకాలంలో ప్రాణాలను తెగించిన వైద్యులు, సిబ్బంది ధైర్యంగా అందించిన సేవలు మరువలేనివన్నారు. సంగారెడ్డి, రామగుండం, శంషాబాద్లలో కొత్తగా 100 పడకల దవాఖానలను ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా పల్లెలు, పట్టణాలతో ఆరోగ్యకరమైన సమాజం రూపుదిద్దుకునేలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అందరూ తోడ్పాటునందించాలని కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కార్పొరేట్ దవాఖానాలకు దీటుగా ఈఎస్ఐసీ దవాఖానలో వైద్య సేవలను అందిస్తున్నారని, వైద్య విద్యను అభ్యసిస్తూనే కరోనా రోగులకు సేవలను అందించారని అభినందించారు. కేంద్ర మంత్రి రామేశ్వర్ తెలి మాట్లాడుతూ, కొవిడ్ మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈఎస్ఐసీ ద్వారా ఎంతో మంది రోగులకు సేవలను అందించామని, రానున్న రోజులలో మరిన్ని ఈఎస్ఐసీ దవాఖానాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, పాత బడిన ఈఎస్ఐసీ దవాఖానల స్థానంలో అధునిక వసతులతో వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా కళాశాల డీన్ శ్రీనివాస్ యువ వైద్యులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్.కె.గుప్త, ఈఎస్ఐసీ డైరెక్టర్ జనరల్ ముక్మిత్ ఎస్.బాటియా, ఈఎస్ఐసీ మెడికల్ కమిషనర్ డాక్టర్ అన్షు చాబ్రా పాల్గొన్నారు. మంత్రి భూపేందర్ యాదవ్, మంత్రి రామేశ్వర్ తేలితో కలిసి సనత్నగర్ డివిజన్లోని సామల కుంట బస్తీలో సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జరుగుతున్న కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఈఎస్ఐసీ ద్వారా అందుతున్న సేవలపై బస్తీ వాసులను ఆరా తీశారు.
నిధుల లోటు లేకుండా చూస్తా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఓపీడీ, హాస్టల్ భవనాలు 2024 నాటికి పూర్తయ్యే లా చొరవ తీసుకుంటానని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులతో కలిసి ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య కళాశాలల ఆవరణలో నిర్మాణంలో ఉన్న హాస్టల్, ఓపీ డీ భవనాలను పరిశీలించారు. జి.కిషన్రెడ్డి మాట్లాడుతూ, ఇక్కడి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్మికులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు వీలుగా ప్రతిపాదిత న్యూక్లియర్ మెడిసిన్, రేడియో థెరపి, కార్డియాలజీ క్యాథ్ ల్యాబ్లను కూడా సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.