Akbaruddin Owaisi | హైదరాబాద్ : తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితిపై సభలో నిర్వహించిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడారు.
అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ.. దేశ సగటు కంటే ఎక్కువగా ఉందన్నారు. పాతబస్తీలో గత ప్రభుత్వ హయాంలో రూ. 25 వేల కోట్ల అభివృద్ధి జరిగింది. ప్రజాప్రతినిధిగా సమస్యలను ప్రస్తావించడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరిస్తారో.. లేదో ప్రభుత్వ ఇష్టం అని ఒవైసీ పేర్కొన్నారు.
2014తో పోలిస్తే తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరిగింది. రాష్ట్రంలో విద్యుత్ లైన్లు, సబ్ స్టేన్లను పెద్ద సంఖ్యలో పెంచారు. చాలాకాలం వరకు గృహ వినియోగదారులకు కరెంట్ ఛార్జీలు పెంచలేదు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా భారీగా పెరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెన్కో ఆస్తులు రూ. 12 వేల 783 కోట్ల నుంచి రూ. 40 వేల 454 కోట్లకు పెరిగాయి. ప్రతి ఇంటికి 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. గృహజ్యోతి భారాన్ని ఇతర వినియోగదారులపై వేయొద్దు. ప్రభుత్వ శాఖల విద్యుత్ బిల్లులు నేరుగా డిస్కంలకు చెల్లించాలి అని అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.