వింతైన పక్షులు.. వినసొంపైన రాగాలు.. చెరువుల్లో గలగలలు.. నిన్నటి వరకు ఆకట్టుకున్న వలస నేస్తాలు స్వస్థలాలకు తిరుగుముఖం పట్టాయి. రాష్ట్రంలో ఏర్పడిన అనుకూల వాతావరణంతో దేశ, విదేశాల వలస పక్షుల రాక పెరిగింది. మిషన్ కాకతీయ ఫలితంగా చెరువులన్నీ జలకళను సంతరించుకొని విదేశీ పక్షులకు ఆతిథ్యానివ్వడం విశేషం.
రకరకాల దేశ, విదేశీ పక్షులకు రాష్ట్రం ఆతిథ్యమిస్తున్నది. ఖండాంతరాలు దాటుకొని వేల కిలోమీటర్ల దూరం పయనించి గగనతలంలో విహరిస్తున్న విహంగాలకు రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఒకప్పుడు రెండు నుంచి మూడు లక్షల లోపు ఉన్న పక్షుల సంఖ్య ఇప్పుడు నాలుగు లక్షలు దాటిందని బర్డ్ వాచర్ సొసైటీలు చెబుతున్నాయి. గత యేడాది 2019 చలికాలంలో వచ్చిన పక్షులసంఖ్య నాలుగులక్షలు దాటగా ఈ సంవత్సరం అదే సమయంలో వచ్చిన పక్షుల సంఖ్య 15శాతం పెరిగినట్టు బర్డ్ వాచర్స్ ప్రాథమిక పరిశీలనలో తేలింది.
ప్రస్తుతం వలస పక్షులు తమ స్వస్థలాలకు తిరిగివెళ్తుండటంతో అసలు రాష్ర్టానికి ఎక్కడెక్కడి నుంచి ఎన్ని రకాల పక్షులు వలస వచ్చాయనే విషయం తెలుసుకోవడానికి అటవీశాఖ, బర్డ్వాచర్స్ సొసైటీ, ఇతర సంస్థలు సంయుక్తంగా ప్రత్యేక గణన చేపడుతున్నాయి. ‘హైదరాబాద్ బర్డ్ పాల్స్ సంస్థ’ ఇటీవల నెహ్రూ జుపార్క్ సింగోజి సరస్సులో వలసపక్షులపై పరిశోధన చేపట్టారు.
కాకతీయ చెరువుల్లో పాగా..
ఈ సారి పెద్ద చెరువుల్లో నీరు బాగా నిలిచినందున తక్కువ నీటిమట్టం ఉన్న మిషన్ కాకతీయ చెరువుల్లో వలస పక్షులు పెద్దసంఖ్యలో పాగా వేసినట్లు గుర్తించారు. మంజీరా, సింగూరు, అన్నాసాగర్, పోచారం, గండిపేటతోపాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మిషన్ కాకతీయలో అభివృద్ధి చేసిన చెరువులు, కుంటలు వలస పక్షులకు విడిది కేంద్రాలుగా మారాయని పరిశీలనలో వెల్లడైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ) ప్రాంగణంలో చెరువు, అమీన్పూర్ అన్నాసాగర్, ఉస్మాన్సాగర్ లాంటి చెరువుల్లో అరుదైన పక్షులు కనిపించాయి.
అమీన్పూర్, ఎదులాబాద్, వరంగల్ పాకాల, ఏటూరునాగారం, నల్లమల ఫర్హాబాద్, నిజాంసాగర్, నాగార్జునసాగర్, గండిపేట, హిమాయత్సాగర్లో అరుదైన పక్షులు కనిపించాయని దక్కన్ బర్డర్స్ సొసైటీ తెలిపింది. యేటా బార్హెడెడ్ గూస్, షెవెల్లర్ ఓపెన్ బిల్డక్, స్పాట్బిల్ డక్, బ్రాహ్మణి డక్, పెయింటెడ్ స్టార్క్, ఫ్లెమింగో, నైట్ హెరాన్వంటి రకరకాల జాతుల పక్షులు తెలంగాణకు వలస వస్తున్నాయని ‘డెక్కన్ బర్డర్స్’ ప్రతినిధి శ్రీకాంత్ పేర్కొన్నారు.
అరుదైన పక్షుల రాక
మంగోలియా ప్రాంతం నుంచి అరుదైన బార్హెడెడ్ గూస్ అనే పక్షులు వ లస వచ్చాయని శ్రీకాం త్ తెలిపారు. ఈసారి సెంట్రల్ యూరప్ నుంచి హిమాలయాల నుంచి షెల్డక్ హుస్సేన్సాగర్ లో కనిపించిందన్నారు. జూపార్క్లో అత్యంత అరుదైన రెడ్ బ్రెస్టెడ్ ఫ్లైక్యాచర్ కనిపించినట్లు హైదరాబాద్ బర్డ్ పాల్స్ సొసైటీ ప్రతినిధి కల్యాణ్ వెల్లడించారు.