సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ) : ‘తర్వాతి స్టేషన్ ఫలక్నుమా.. తలుపులు ఎడమవైపున తెరుచుకుంటాయి..’ అంటూ అందమైన గొంతును పాతనగర ప్రయాణికులు వినే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాతనగరం మెట్రో త్వరలోనే పట్టాలెక్కనున్నది. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సోమవారం సీఎం కేసీఆర్ పురపాలక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి కేటీఆర్ ట్విటర్లో వెల్లడించారు. కారిడార్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు నాలుగు మెట్రోస్టేషన్ల (సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్గంజ్)తో అలైన్మెంట్ను ఇప్పటికే ఖరారు చేశారు. సుమారు రూ.2వేల కోట్ల అంచనాతో 5.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్), ఎల్ అండ్ టీ సంస్థ తదుపరి చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు నివేదిక రూపొందించి.. ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నాయి.