ఐదేండ్ల కిందట తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన హైదరాబాద్ మెట్రో మరో మైలురాయిని అందుకోనున్నది. ప్రతిష్టాత్మకమైన ఎయిర్పోర్టు కారిడార్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు అత్యంత వేగవంతమైన ప్రజా రవాణా సాధనంగా మెట్రోను తీసుకురావాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ మేరకు కార్యరూపం ఇచ్చింది. కారిడార్-3లోని నాగోల్ -రాయదుర్గం వరకు మెట్రోను కలుపుతూ..ఓఆర్ఆర్ మీదుగా ఎయిర్పోర్టు లోపలి వరకు మొత్తం 31 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించనున్నది. సుమారు 6,250 కోట్ల బడ్జెట్తో నిర్మించే ఈ ప్రాజెక్టుకు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు.
హైస్పీడ్ మెట్రో రైలు ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైలు సంస్థతో డీపీఆర్ను సిద్ధం చేసింది. కాగా, నగరంలో మెట్రో సేవలు ప్రారంభమై నవంబర్ 29 నాటికి సరిగ్గా ఐదేండ్లు. ఈ ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, అవార్డులతో ప్రయాణికుల ఆదరాభిమానాలు చూరగొన్నది హెచ్ఎంఆర్. 4 లక్షలకుపైగా ట్రిప్పులతో 30 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం 3 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంది.
రాయదుర్గం- ఎయిర్పోర్టు (31 కి.మీ)
విమానాశ్రయంతో మెట్రో రైలు మార్గం అనుసంధానమైతే కేవలం 25-30 నిమిషాల్లో అక్కడి నుంచి ఐటీ కారిడార్లోని రాయదుర్గం, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ సైబర్ టవర్స్కు చేరుకోవచ్చు. ఎయిర్పోర్టు కారిడార్(31 కిలోమీటర్ల మార్గం)లో ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున సుమారు 7-8 మెట్రో స్టేషన్లు నిర్మించేలా డీపీఆర్ను సిద్ధం చేశారు.
బయో డైవర్సిటీ జంక్షన్
నానక్రాంగూడ
నార్సింగి
టీఎస్ పోలీస్ అకాడమీ
రాజేంద్రనగర్
శంషాబాద్ టౌన్
ఎయిర్పోర్టు కార్గో స్టేషన్, టర్మినల్ వద్ద
సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎయిర్పోర్టు మెట్రో కారిడార్కు నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు అత్యంత వేగవంతమైన ప్రజా రవాణా సాధనంగా మెట్రోను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోని కారిడార్-3లో నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రోను కలుపుతూ ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ విమనాశ్రయం లోపలి వరకు 31 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. సుమారు రూ. 6,250 కోట్ల బడ్జెట్తో నిర్మించే ఈ ప్రాజెక్టుకు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కే.టీ.రామారావు ఆదివారం ట్వీట్ చేశారు. హైస్పీడ్ మెట్రో రైలు ప్రాజెక్టుగా ప్రభుత్వం దీన్ని చేపట్టాలని నిర్ణయించి, ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైలు సంస్థతో డీపీఆర్ను సిద్ధం చేసి ఉంచింది.
ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యం…
హైస్పీడ్ ఎయిర్ పోర్టు మెట్రో రైలు ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టేందుకు వినూత్న పంథాను తెలంగాణ ప్రభుత్వం అవలంబించనుంది. నగరంలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు తరహాలో పూర్తిగా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని పలు సంస్థలు భరించేలా చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్తో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ), జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్టు లిమిటెడ్లను భాగస్వాములను చేయనుంది.
10 శాతం వాటాను భరించనున్న జీఎంఆర్…
ప్రపంచంలోనే ఉత్తమ శ్రేణి విమానాశ్రయాల్లో ఒకటిగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. నగరం నుంచి సుమారు 31 కి.మీ దూరం ఉన్న విమానాశ్రయానికి చేరుకునేందుకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెట్రో రైలు మార్గం అత్యంత కీలకంగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఈ ప్రాజెక్టులో తమ వంతు వాటా 10 శాతం మేర పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిని కనబర్చింది. మెట్రో రైలు మార్గంతో ఎయిర్పోర్టుకు అనుసంధానమే విమానయాన రంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందనే ఉద్ధేశ్యంతో జీఎంఆర్ ఉంది.
ఎయిర్పోర్టు మెట్రో కారిడార్లో వచ్చే మెట్రో స్టేషన్లు…
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో మెట్రో రైలు మార్గం అనుసంధానమైతే కేవలం 25-30 నిమిషాల్లో విమానాశ్రయం నుంచి ఐటీ కారిడార్లోని రాయదుర్గం, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ సైబర్ టవర్స్కు చేరుకోవచ్చు. సుమారు 30 కి.మీ దూరం ఉండే ఈ మార్గంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మెట్రో స్టేషన్ చొప్పున సుమారు 7-8 మెట్రో స్టేషన్లను నిర్మించేలా డీపీఆర్ను సిద్ధం చేశారు. ఇందులో ప్రధానంగా బయో డైవర్సిటీ జంక్షన్, నానక్రాంగూడ, నార్సింగి, టీఎస్ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్టౌన్ , ఎయిర్పోర్టు కార్గో స్టేషన్, టర్మినల్ వద్ద మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు.
సౌత్-వెస్ట్ జోన్లలో అభివృద్ధికి మరింత ఊతం..
ఐటీ కారిడార్తో హైదరాబాద్ నగరం వెస్ట్ జోన్ వైపు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆకాశమే హద్దుగా వెస్ట్ జోన్లో ఐటీ కార్యాలయాల కోసం ఆఫీసులు, అదేవిధంగా ఐటీ ఉద్యోగుల కోసం గేటెడ్ కమ్యూనిటీ వంటి ప్రాజెక్టులు రావడంతో ఈ ప్రాంతం విస్తృతంగా అభివృద్ధి చెందింది. ఇప్పటికే ఐటీ కారిడార్-శంషాబాద్ ఎయిర్పోర్టుల మధ్య ఔటర్ రింగు రోడ్డు అందుబాటులో ఉండడంతో పాటు కొత్తగా ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు వస్తే ఈ రెండు ప్రాంతాల మధ్య అభివృద్ధికి ఊతం ఇచ్చే అవకాశం ఉంది.