హైదరాబాద్: నేడు ఎంజీబీఎస్-జేబీఎస్ రూట్లో మెట్రో సర్వీసులు నిలిచిపోనున్నాయి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ సభకు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థాయి నేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 గంటల వరకు మెట్రో సేవలు నిలిపివేస్తున్నట్లు సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పరేడ్ గ్రౌండ్లో బీజేపీ సభ దృష్ట్యా మెట్రో రైళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఉప్పల్-మియాపూర్ రూట్లో కూడా రైళ్లు అందుబాటులో ఉండవని చెప్పారు.
కాగా, రెండు రోజులపాటు మెట్రో రైల్లు నిలిచిపోనున్నాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎన్వీఎస్ రెడ్డి తోసిపుచ్చారు. ఆదివారం సాయంత్రం వరకు మూడు కారిడార్లలో రైళ్లు యధావిధిగా నడుస్తాయని చెప్పారు. సభ జరుగుతున్న సమయంలో మాత్రం MGBS-JBS మధ్య, ఉప్పల్-మియాపూర్ రూట్లో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.