సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మెట్రోతో అనుసంధానం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. హైస్పీడ్ మెట్రో రైలు ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించి ఇందుకోసం ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైలు సంస్థతో డీపీఆర్ను సిద్ధం చేయించింది. ఐటీ కారిడార్లోని రాయదుర్గం (మైండ్ స్పేస్ జంక్షన్) మెట్రో స్టేషన్ నుంచి కొనసాగింపుగా హైస్పీడ్ ఎయిర్పోర్టు మెట్రో రైలు ప్రాజెక్టును శంషాబాద్ ఎయిర్పోర్టుతో కలుపుతూ సుమారు 31 కిలోమీటర్ల మేర పొడవునా నిర్మించనున్నారు. ఇందుకోసం సుమారు రూ.5000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వం తరుపున ఇతర సంస్థలను భాగస్వాములను చేస్తూ ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ మోడల్లో ఎయిర్పోర్టు మెట్రో లింకు ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. దీంతో ఈ ప్రాజెక్టులో తమ వంతు వాటా 10 శాతం మేర పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిని కనబర్చింది. మెట్రో రైలు మార్గంతో ఎయిర్పోర్టుకు అనుసంధానమే విమానయాన రంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో జీఎంఆర్ ఉంది.
హైస్పీడ్ ఎయిర్పోర్టు మెట్రో రైలు ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న పంథాను ఎంచుకున్నది. ఇప్పటికే నగరంలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు తరహాలో పూర్తిగా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని పలు సంస్థలు భరించేలా చూడాలని నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) సంస్థను ఏర్పాటు చేసింది.
ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్తో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ), జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్టు లిమిటెడ్లను ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయనున్నది.
హైస్పీడ్ మెట్రో ప్రాజెక్టుతో భవిష్యత్తులో హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్టు సంస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఈ కారణంగానే వారిని ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా నిధుల కొరత లేకుండా చేసి.. భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్వహణతో పాటు లాభాలను ఆయా సంస్థలు పొందేలా అవకాశం కల్పించనున్నది.
నగర శివారులో ఉన్న శంషాబాద్ విమానాశ్రయంతో మెట్రో రైలును అనుసంధానం చేయడాన్ని ప్రభుత్వం అత్యంత కీలకంగా పరిగణిస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరుంది. నగరానికి సుమారు 30 కి.మీ దూరంలో ఉన్న దీన్ని చేరుకునేందుకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నా.. మెట్రో లేదు.
ఇప్పటికే నగరంలో 69 కి.మీ మేర ఉన్న మెట్రో రైలు మార్గాలతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు నిమిషాల వ్యవధిలో చేరుకునేందుకు అత్యంత అనువైన మార్గంగా ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టును పరిగణిస్తున్న ప్రభుత్వం ఇందులో జీఎంఆర్ను భాగస్వామిగా చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. మెట్రో రైలు ప్రాజెక్టుతో ఎయిర్పోర్టుతో పాటు ఇందులో భాగస్వామ్యం అవుతున్న సంస్థలకు అనేక ప్రయోజనాలు కలుగుతుండటంతో ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో మెట్రో రైలు అనుసంధానమైతే కేవలం 20 నిమిషాల్లో ఐటీ కారిడార్లోని రాయదుర్గం, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ సైబర్ టవర్స్ను చేరుకోవచ్చు. సుమారు 30 కి.మీ దూరం ఉండే ఈ మార్గంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున సుమారు 7-8 మెట్రో స్టేషన్లను నిర్మించాలని డీపీఆర్ను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో ప్రధానంగా బయో డైవర్సిటీ జంక్షన్, నానక్రాంగూడ, నార్సింగి, టీఎస్ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్, ఎయిర్పోర్టు కార్గో స్టేషన్, టర్మినల్ వద్ద మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు.