సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు పనులు క్షేత్రస్థాయిలో కొనసాగుతున్నాయి. విమానాశ్రయంతో నగరానికి మెట్రో అనుసంధానం ఉండాలనే సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పనులను వేగంగా పూర్తి చేసే పనిలో మెట్రో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉన్నది. ఐటీ కారిడార్లోని రాయదుర్గం మైండ్స్పేస్ జంక్షన్ నుంచి మొదలై ఈ పనులు శంషాబాద్ ఎయిర్పోర్టు లోపలి వరకు కొనసాగనున్నాయి. సుమారు 31కి.మీ మేర నిర్మించనున్న మెట్రో మార్గాన్ని ఔటర్ రింగురోడ్డు లోపలి వైపు నిర్మించేలా రూట్ మ్యాప్ను ఖరారు చేశారు. దీనికి అనుగుణంగా నిర్ణయించిన మార్గంలో మెట్రో పిల్లర్ల నిర్మాణం చేపట్టేందుకు వీలుగా రైట్ ఆఫ్ వేను సిద్ధం చేస్తున్నారు.
మొత్తం 31కి.మీ మార్గంలో ప్రైవేటు ఆస్తుల సేకరణ చాలా తక్కువ మొత్తంలో ఉన్నది. ఇప్పటికే వీటి గుర్తింపు పని పూర్తి కాగా, త్వరలోనే వాటిని సేకరించేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక మిగతా మెట్రో మార్గమంతా ఔటర్ రింగు రోడ్డు వెంబడి ఉన్న రైల్వే కారిడార్లోనే నిర్మిస్తుండటంతో ఇక్కడ రైట్ ఆఫ్ వే సమస్య లేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు స్వతంత్ర ఇంజినీరింగ్ సంస్థను ఎంపిక చేయడంతో అధికారులు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారులు రైట్ ఆఫ్ వే మార్గంలో ఉన్న స్థలాన్ని చదును చేసి యంత్రాలతో పనులు సాఫీగా, వేగంగా నిర్వహించేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి మొదలయ్యే ఎయిర్పోర్టు మార్గంలో పలుచోట్ల గుట్టలు, ఎత్తయిన ప్రాంతాలు ఉండటంతో వాటిని తొలగించి నేలను సమాంతరం చేసి, నిర్మాణానికి సంబంధించిన వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
నెలాఖరులో ఎయిర్పోర్టు మెట్రో నిర్మాణ సంస్థ ఎంపిక
హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో కారిడార్ ప్రాజెక్టును రూ.6250 కోట్ల అంచనాతో చేపట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి కాగా, రెండు కంపెనీలు బరిలో ఉన్నాయి. వీటిలో అర్హత కలిగిన కంపెనీని ఎంపిక చేయాల్సి ఉన్నది. టెక్నికల్ బిడ్తో పాటు ఫైనాన్సియల్ బిడ్లను ఇతర అంశాలను మెట్రో అధికారులతోపాటు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం నియమించిన స్వతంత్ర ఇంజినీరింగ్ సంస్థ కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసే పనిని పూర్తి చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపిన వెంటనే కాంట్రాక్టు సంస్థను ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియ ఈ నెలఖారులోగా పూర్తవుతుందని, ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థ ఈపీసీ విధానంలో పనులు చేపట్టనుందని మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో కారిడార్ నిర్మించే మార్గంలో రైట్ ఆఫ్ వై దాదాపు సిద్ధంగా ఉండటంతో వెంటనే పనులు మొదలు పెట్టనున్నారు. అదేవిధంగా మెట్రో డిపో కోసం అవసరమైన స్థలాన్ని కేటాయించాలని జీఎంఆర్ ఎయిర్పోర్టు సంస్థను కోరడంతో వారు ఆ స్థలాన్ని మెట్రోకు అప్పగించారు. ఇలా ప్రాజెక్టు మొత్తానికి అవసరమైన భూమిని సిద్ధంగా ఉంచి, నిర్మాణ సంస్థను ఎంపిక చేయగానే పనులు వెంటనే మొదలు పెట్టేందుకు వీలుగా మెట్రో అధికారులు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు.