Gruha Jyothi Scheme | హైదరాబాద్ : ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు గృహజ్యోతి పథకం అమలు కోసం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విద్యుత్ బిల్ కలెక్టర్లు.. బిల్ జనరేట్ చేసేందుకు వెళ్లిన సమయంలోనే.. ఓనర్లు, అద్దెకుండే వారి వివరాలతో పాటు ఎలక్ట్రిసిటీ బిల్ వంటి వివరాలను సేకరించాలని విద్యుత్ అధికారులు నిర్ణయించారు.
కానీ హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల బిల్ కలెక్టర్లు విద్యుత్ బిల్లులు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఉచిత విద్యుత్కు తాము అర్హులమని, వివరాలు తీసుకెళ్లండంటే.. తమ ఆఫీసులకు వచ్చి సమర్పించాలని సూచిస్తున్నారని ప్రజలు తెలిపారు. అపార్ట్మెంట్లలో అయితే సెక్యూరిటీకే బిల్లులు ఇచ్చి వెళ్తున్నట్లు తెలిసింది. ఇక బిల్ కలెక్టర్ల నిర్వాకం వల్ల.. ప్రజలు తమ సమీపంలో ఉన్న విద్యుత్ కార్యాలయాలకు భారీగా తరలివెళ్తున్నారు. తమ వివరాలను అధికారులకు సమర్పించేందుకు కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు.
రాష్ట్రంలో 34 లక్షల కుటుంబాలు గృహజ్యోతి పథకానికి అర్హులుగా ఉన్నారు. అయితే ఈ పథకం నుంచి లబ్ధి పొందేందుకు ప్రతి కుటుంబం పాటించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. అర్హులైన వారు తమ తెల్ల రేషన్ కార్డ్లను ఆధార్ నంబర్తో లింక్ చేసి ఉంటేనే ఈ పథకం కింద లబ్ది పొందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. గృహ జ్యోతి పథకం అద్దెదారులతో సహా, ఒకే మీటరు ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. విద్యుత్ బిల్లు బకాయిలు ఉన్న వినియోగదారులు లేదా గత రెండు నెలలుగా విద్యుత్ బిల్లు చెల్లించని వినియోగదారులు ఈ పథకానికి అర్హులు కారని స్పష్టం చేసింది. ఇక 2022-23లో 2,181 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ను వినియోగిస్తే వారు కూడా అర్హులు కారు. గృహ జ్యోతి పథకం కోసం ప్రజాపాలనలో 81.54 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ సంఖ్య ఇప్పుడు 90 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి గృహజ్యోతి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.