మన్సూరాబాద్, ఆగస్టు 12 : రోడ్డు సేఫ్టీపై సంస్కరణల కోసం ఇటీవల సుప్రీం కోర్టు (ప్రాజెక్ట్ కన్సల్టంట్ ఫర్ సుప్రీం కోర్టు ఆన్ రోడ్డు సేఫ్టీ) నియమించింది. రోడ్డు సేఫ్టీ కమిటీలోని సభ్యుడు కిరణ్ గురువారం నాగోల్లోని బాబు జగ్జీవన్రాం డ్రైవింగ్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. కమిటీ ప్రతినిధులు దేశంలోని వివిధ రాష్ర్టాల్లో పర్యటిస్తూ రోడ్డు సేఫ్టీపై వాహనదారులకు కల్పిస్తున్న శిక్షణ, తీసుకుంటున్న చర్యలు, అవగాహనపై అధ్యయనం చేస్తున్నారు.
ఇందులో భాగంగా నాగోల్లోని డ్రైవింగ్ పరీక్షా కేంద్రానికి వచ్చిన కమిటీ సభ్యుడు కిరణ్ నూతనంగా లైసెన్స్లు తీసుకునేందుకు వచ్చే వ్యక్తులకు నిర్వహించే డ్రైవింగ్ పరీక్షల తీరును పరిశీలించారు. వాహనదారులకు నిర్వహించే డ్రైవింగ్ టెస్ట్ల కోసం ఏర్పాటు ట్రాక్ను ఆయన అధ్యయనం చేశారు.
వాహనదారుల లైసెన్స్లు జారీ సందర్భంగా నిర్వహిస్తున్న డ్రైవింగ్ పరీక్షా కేంద్రం తీరు తదితర విషయాలను నాగోల్ ఆర్టీఓ సురేష్రెడ్డిని కిరణ్ అడిగి తెలుసుకున్నారు.
సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సభ్యులు దేశంలోని అన్ని ప్రాంతాలలో అధ్యయనం చేసి రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించే అవకాశం ఉందని ఆర్టీఓ సురేష్రెడ్డి తెలిపారు.