దాదాపు 100 సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన లంగర్హౌస్ క్రైం పోలీసులు.. దొంగల ఆచూకీని కనుగొన్నారు. సెల్ఫోన్ టవర్ల ఆధారంగా దొంగలు ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. బుధవారం ఉదయం రేతిబౌలిలో ఉన్న నేరగాళ్లు.. పారిపోయేందుకు ఇతర రాష్ర్టాలకు వెళ్లే బస్సులు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు వారిని గుర్తించి పట్టుకున్నారు. విచారణలో లంగర్హౌస్తో పాటు దుండిగల్లో జరిగిన చోరీ కేసు మిస్టరీ కూడా వీడినట్టు డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
మెహిదీపట్నం, నవంబర్ 16 : చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్తులను పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 51 తులాల బంగారు నగలు, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ డీసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జోయల్ డేవిస్, ఏసీపీ శివమారుతి , ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అదనపు ఇన్స్పెక్టర్ ముజీబుర్ రహ్మన్ వివరాలను వెల్లడించారు. లంగర్హౌస్ కాకతీయనగర్లో నివసించే అనిల్ అగర్వాల్ ఈనెల 6వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి కొండాపూర్లోని షాపింగ్ మాల్కు వెళ్లారు. అర్ధరాత్రి తర్వాత తిరిగి ఇంటికి వచ్చి చూడగా ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లంగర్హౌస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. దాదాపు 100 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నేరస్తులను గుర్తించారు.
నిందితులంతా పాత నేరస్తులే..
చార్మినార్ ప్రాంతానికి చెందిన రాహుల్ కుమార్ శర్మ అలియాస్ భరత్ కుమార్ శర్మ, నాగోల్ నివాసి కట్టెల అనూప్ కుమార్ అలియాస్ టింకు అలియాస్ నితేశ్ అలియాస్ రాజు, చర్లపల్లి నివాసి సుంకం రాజు స్నేహితులు. భరత్కుమార్ శర్మ 88 కేసుల్లో నిందితుడిగా ఉండి.. పీడీ యాక్ట్లో 4 సార్లు, అనూప్ కుమార్ 9 కేసుల్లో నిందితుడిగా ఉండి.. రెండుసార్లు పీడీ యాక్ట్లో జైలుకు వెళ్లి వచ్చాడు. సుంకం రాజు హత్య, దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా పెట్టుకొని చోరీలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా.. భరత్కుమార్ శర్మ బంధువు కాకతీయనగర్లో ఓ ఇంట్లో కారు డ్రైవర్గా పనిచేసి మానేశాడు. ఆ ఇంటిని లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో కాకతీయనగర్లోని అనిల్ అగర్వాల్ ఇంటిని దొంగతనానికి ఎంచుకున్నారు. రెక్కీ కూడా నిర్వహించారు. అనంతరం వీరందరూ కలిసి అనిల్ అగర్వాల్ ఇంటికి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వెళ్లారు. తాళాలు పగుల గొట్టి దొంగతనం చేసి ఉడాయించారు.