హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మత కల్లోలాలపై నిఘా పెట్టాలని సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పోలీసులను ఆదేశించారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మతకల్లోలాలపై సీపీ ఆనంద్.. ఏసీపీ, ఆపై స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పలు రాజకీయ, మత సంస్థలపై నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే పోలీసులు తక్షణమే అప్రమత్తం కావాలన్నారు. నగరంలో సమర్థవంతమైన పోలీసింగ్ నిర్వహణపై కూడా చర్చించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలు, పండుగలకు భద్రత కల్పించాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.