ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 3: నెలరోజుల్లో 46,340 మంది ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించామని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. గ్రాండ్ హెల్త్ చాలెంజ్ పేరుతో నిర్వహించిన ఈ పరీక్షల్లో భాగంగా తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న దాదాపు 300 మంది ఉద్యోగుల ప్రాణాలను కాపాడామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో చల్లా చారిటబుల్ ట్రస్ట్తో కలిసి నెలకొల్పిన బ్లడ్బ్యాంకును మంగళవారం సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం గ్రాండ్ హెల్త్ చాలెంజ్, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్టీసీ సిబ్బంది, ప్రజలు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు త్వరలో ప్రతీ డిపోలో హెల్త్ వలంటీర్లను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అనంతరం ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ను సజ్జనార్ ప్రారంచించి, ఆర్టీసీ భవన విస్తరణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అడ్వైజర్ సైదిరెడ్డి, సీపీఎం కృష్ణకాంత్, సీఎఫ్ఎం విజయపుష్ప, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ, మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.