Hyderabad | హైదరాబాద్లోని వివిధ వార్త సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిస్టులు, స్కానింగ్ ఆపరేట్స్, లైబ్రేరియన్లు టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో ఆర్టిస్టులు, స్కానింగ్ ఆపరేటర్స్, లైబ్రేరియన్లకు హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని శ్రీనివాస్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులంతా వార్తాపత్రికల ప్రచురణలో తమ పాత్రను వెల్లడించారు.
వర్కింగ్ జర్నలిస్టులతో సమానంగా సంక్షేమ పథకాలు, ప్రయోజనాల రూపంలో సహకారం అందించాలని కోరారు. టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ, టీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షుడు కోటిరెడ్డి మద్దతు తెలిపారు. ఆర్టిస్ట్లు, లైబ్రేరియన్లు, స్కానింగ్ ఆపరేటర్లు అందరూ న్యూస్రూమ్లలో అంతర్భాగమని, వార్తాపత్రికల తయారీలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులుగా ఆర్టిస్టులు, స్కానింగ్ ఆపరేటర్లు, లైబ్రేరియన్లందరికీ అర్హులైన అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ సందర్భంగా బీ శ్రవణ్ కుమార్, భాను ప్రసాద్ సింగీతం ఆధ్వర్యంలోని ఉద్యోగులు మీడియా అకాడమీ చైర్మన్కు వినతిపత్రం అందజేశారు.