హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతన్న సంతోషంగా ఉండడం ఇష్టంలేకనే షర్మిల అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ ఆరోపించారు. బీజేపీ టీమ్ పార్టీలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ పట్టించుకోరని ఆయన తేల్చిచెప్పారు. తమను ప్రజలు పట్టించుకోవటంలేదనే అక్కసుతో బీఎస్పీ, వైఎస్ఆర్టీపీ నేతలు బీఆర్ఎస్ పార్టీమీద అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. రైతన్నకు లబ్ధి చేకూరే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సరార్కు నష్టమని వైఎస్ షర్మిల పేర్కొనటం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతన్నకు సాగునీరు అందించడం కోసం కానీ లాభాల కోసం కాదన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల చేతిలో బీడువారిన తెలంగాణ అయితే నేడు సీఎం కేసీఆర్ పాలనలో హరితవర్ణశోభితమై విరాజిల్లుతున్నదని చెప్పారు. రైతులు సంతోషంగా ఉండడం ఇష్టంలేకనే ఓర్వలేని తనంతో షర్మిల బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తుందన్నారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలనతో ఎండాకాలంలోనూ చెరువులు మత్తడులు దూకుతున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయతో పూడిక తీసిన చెరువు మట్టి పొలాల్లో వేయటం ద్వారా సారం పెరిగి దిగుబడులు అధికం అయ్యాయని ఆయన గుర్తుచేశారు. చెరువుల మీద ఆధారపడ్డ అనేక కులవృత్తులు పూర్వవైభవంతో పొంగిపోతున్నాయన్నారు.