పండ్లు, కూరగాయల ఎక్స్పోర్టుకు (ఎగుమతుల) ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇండస్ట్రీస్, వాణిజ్యశాఖల సమన్వయంతో కూరగాయలను వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు రైతులు ముందుకు వచ్చేలా అవగాహన కల్పించనున్నారు. దీని ద్వారా రైతులు మరింత ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది.. దీంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి..ఎగుమతులపై ప్రణాళికను త్వరితగతిన అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో ఉద్యానవన శాఖ మేడ్చల్ జిల్లా అధికారులు ఎగుమతులపై రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి.. మొదట 1800 ఎకరాల్లో పంట సాగు చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు.
పండ్లు, కూరగాయలు సాగుచేసే రైతులను గుర్తించి ఉద్యానవన శాఖ రైతు సంఘాలను ఏర్పాటు చేయనుంది. ఏర్పాటు చేసిన రైతు సంఘాల సభ్యులకు ఎగుమతులపై కలిగే లాభాలను వివరించనున్నారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న పండ్లు, కూరగాయల పంటలను మాత్రమే సాగుచేసే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తారు. నాణ్యమైన పంటల దిగుబడులపై సూచనలు చేస్తారు.
మేడ్చల్ జిల్లా నుంచి విదేశాలకు పండ్లు, కూరగాయల ఎగుమతులకుగానూ మొదట 1800 ఎకరాల్లో సాగు చేసే ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో విదేశాల్లో డిమాండ్ ఉన్న దాక్ష, మామిడి, కూరగాయల్లో బెండకాయ, కాకర, బీర, చిక్కుడు, మునుక ఎగుమతులకు ప్రణాళికను రూపొందించారు. సుమారు 75 వేల మెట్రిక్ టన్నుల పండ్లు, కూరగాయలను ఎగుమతి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
పండ్లు, కూరగాయల ఎగుమతికి ముందుకు వచ్చే రైతు సంఘాలకు ఇండస్ట్రీస్, వాణిజ్యశాఖలు ప్రభుత్వ ఆదేశాల మేరకు సహకారం అందించనున్నాయి. విదేశాలకు ఎగుమతి చేసే విధానాలపై సంఘాలకు పూర్తిగా అవగాహన కల్పించనున్నాయి.. ఎగుమతులకు ఎలాంటి ఖర్చు లేకుండా అనుమతులను అందించనున్నాయి. ఎగుమతులకు అవసరమయ్యే కోల్డ్స్టోరేజ్లు మేడ్చల్ జిల్లాలో అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు.
పండ్లు, కూరగాయలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రణాళికను సిద్ధం చే శాం. జిల్లా వ్యా ప్తంగా రైతు సంఘాలను ఏర్పాటు చేసి విదేశాలకు ఎగుమతులు చేసే విధానాలపై అవగాహన కల్పించనున్నాం. విదేశాల్లో డిమాండ్ ఉన్న పంటలను గుర్తించి సాగు చేయించే ప్రణాళికను అమలు చేస్తాం. మొదట 1800 ఎకరాల్లో సాగు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – సత్తార్, మేడ్చల్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
పండ్లు, కూరగాయల ఎగుమతికి ఇండస్ట్రీ, వాణిజ్యశాఖలు పూర్తి సహకారం అందిస్తాయి. సం ఘాలుగా ఏర్పడి ముందుకు వచ్చిన వారికి ఎక్స్పోర్టు చేసే విధానాలు, అనుమతులు ఇప్పిస్తాం. ఎగుమతులకు అవసరమయ్యే కోల్డ్స్టోరేజ్లు జిల్లాలో అం దుబాటులో ఉన్నాయి. అవసరమైతే మరిన్ని కోల్డ్స్టోరేజ్ల నిర్మాణాలకు ప్రభుత్వం సబ్సిడీ అందించనుంది. – రవీందర్, జిల్లా ఇండస్ట్రీ అధికారి