మేడ్చల్, డిసెంబర్4(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం బాధిత రైతు కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నది. ప్రభుత్వం రైతుబీమా పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 407 మంది రైతు కుటుంబాలకు రూ. 20.35 కోట్ల బీమా(ఇన్సూరెన్స్లను) చెల్లింపులు చేసింది. రైతుబీమా చెల్లింపులలో రాష్ట్రంలోనే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రైతులు ప్రమాదవశాత్తు లేదా సాధారణంగా మరణించినా రైతు కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. బాధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నది. కాగా, జిల్లా వ్యాప్తంగా 44,792 మంది రైతులు ఉండగా ఇందులో 17,473 మంది రైతులకు రైతుబీమా పథకాన్ని ఎన్రోల్మెంట్ చేశారు.
ఐదు రోజుల్లో బీమా డబ్బులు చెల్లింపు
ప్రభుత్వమే ప్రతి సంవత్సరం రైతుబీమా పథకానికి సంబంధించి వ్యవసాయశాఖ పర్యవేక్షణలో ప్రీమియాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తున్నది. బీమా పొంది ఉన్న రైతు మరణిస్తే 5 రోజులలో వారి కుటుంబ సభ్యులకు బీమా డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఏడాది ధరణి పోర్టల్ ఉన్న రైతుల వివరాలను ఆయా గ్రామపంచాయతీలలో పొందుపరుస్తున్నాం. అర్హత ఉన్న రైతులందరకి రైతుబీమా పథకాన్ని వర్తింపజేస్తున్నాం.
– మేరి రేఖ, జిల్లా వ్యవసాయాధికారి