మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 13: మాయ మాటలు చెప్పే బీజేపీ, కాంగ్రెస్ నేతలను నమ్మవద్దని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ 5,6, 14వ వార్డులకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వివిధ కాలనీలకు చెందిన 1000 మంది యువకులు, మహిళలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మల్లారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు బాగా పెరుగుతున్నాయని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రతి ఒక్కరికి అందాయని, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలన్నారు. మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ప్రజలను పట్టించకున్న పాపన పోలేదని, ఇంత వరకు ఒక్క అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు ఎక్కడ లేవని విమర్శించారు. పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధిక అసెంబ్లీ స్థానాలు గెలిచి మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ పార్టీల నేతల చేరికలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి-సంక్షేమం వల్లే వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లిలో నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులే కాకుండా కుల సంఘాల, సంక్షేమ సంఘాల ప్రతినిధులు సైతం బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవలే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్లో భారీగా చేరికలు జరిగాయి. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి, తిరుపతిరెడ్డి, మంగమ్మ ముదిరాజ్, కృష్ణా మదిరాజ్ కూకట్పల్లి అభ్యర్థి మాధవరం కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఉప్పల్లో వైఎస్ఆర్ టీపీ నుంచి ప్రదీప్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నవీన్రెడ్డిలు ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మున్సిపల్ పరిధి టీడీపీ అధ్యక్షుడు అనిల్, శ్రీధర్రావు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అనిత కుత్బుల్లాపూర్ అభ్యర్థి కేపీ వివేకానంద్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మేడ్చల్ నియెజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నిశీతరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు కుడికాల ప్రేమ్కిశోర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు సబ్బని రామకృష్ణ, మేడ్చల్ మున్సిపాలిటీ పరిధికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు శ్రీనాధ్, సాయితేజ, రాంబాబు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివరకు గెలుపు బీఆర్ఎస్దే అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గెలుపు కోరుతూ కొంపల్లి మున్సిపాలిటీ ఫామ్ మిడోస్లో జరిగిన ప్రచారానికి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన తొమ్మిందేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్తో పాటు కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, మహిళా నాయకురాలు సంగీతారెడ్డి, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
మేడ్చల్లో కాంగ్రెస్, బీజేపీలకు నూకలు చెల్లాయని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు ప్రజలంతా తగిన రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలం రాంపల్లిదాయర గ్రామం నుంచి కాంగ్రెస్, బీజేపీల నుంచి సుమారు 100 మంది మంత్రి మల్లారెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకే చక్కటి ఆదరణ ఉన్నదని, ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించడంతో నేడు ప్రజలంతా సుఖంగా జీవిస్తున్నారన్నారు. మేడ్చల్లో తాను భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో అమలు చేసిన ప్రతి పథకం నిరుపేదలకు గొప్ప వరంగా మారిందన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో తను కోట్లాది రూపాయలతో అనేక రకాల అభివృద్ధి పనులు చేశానన్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు తనను చక్కగా ఆదరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాంపల్లిదాయర మాజీ సర్పంచ్ గంగి మల్లేశ్, బీఆర్ఎస్ నేతలు కందాడి శ్రీకాంత్రెడ్డి, మీసాల మల్లేశ్, కందాడి వెంకట్రెడ్డి, గణేశ్చారి, గరుగుల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.