HomeHyderabadMedchal Malkajigiri District Is Developing In All Sectors
జిల్లా ఏర్పాటుతో.. చేరువైన పరిపాలన
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలకు పరిపాలన సౌకర్యంగా మారింది. దీంతో ప్రజల పనులు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కారమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్న సమయంలో దూరభారం సమస్య ఉండేది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి
పెరిగిన మండలాలు, గ్రామపంచాయతీలు
నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలు
మేడ్చల్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలకు పరిపాలన సౌకర్యంగా మారింది. దీంతో ప్రజల పనులు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కారమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్న సమయంలో దూరభారం సమస్య ఉండేది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన సమీకృత కలెక్టరేట్తో జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు సౌకర్యవంతంగా మారింది. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న సమయంలో అధికారులు వివిధ పనుల నిమిత్తం ఫీల్డ్కు వెళితే ప్రజలకు అందుబాటులో లేక పనులు జరగక పోయేవి. కాగా నూతన జిల్లా ఏర్పాటు అనంతరం ఒకే భవనంలో అన్ని శాఖల అధికారులు ఉండేలా బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో కలెక్టరేట్కు వచ్చిన ప్రజలు అన్ని పనులు ఒకేసారి చేసుకుని తిరిగి వెళుతున్నారు.
4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు..
జిల్లా ప్రజలకు సౌకర్యాలను మరిన్ని కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలన సౌలభ్యాన్ని కల్పించింది. కార్పొరేషన్లుగా జవహర్నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్ కాగా… మేడ్చల్, గూండ్లపోచంపల్లి, తూంకుంట, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, పోచారం, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి.
అన్ని రంగాల్లో ..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. జిల్లాగా ఏర్పడిన అనంతరం వేల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పడగా రూ. 4 వందల కోట్ల నిధులతో ఐటీ పార్క్ నిర్మాణం, రూ. 182 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణాలు చేయనున్నారు. రూ. 6 కోట్లతో మత్స్య సాంకేతిక శిక్షణ సంస్థను నిర్మించారు. ఔటర్ రింగ్రోడ్డు సమీపంలో రూ. 50 కోట్లతో జిల్లా సమీకృత కలెక్టరేట్ను నిర్మించి ప్రజలకు సౌకర్యాలు కల్పించడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాక కోట్ల నిధులతో చెరువుల అభివృద్ధి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీటి సరఫరా, రోడ్లు, పార్కులు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించి ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించారు.
నూతనంగా గ్రామపంచాయతీలు, మండలాలు
జిల్లాగా ఏర్పాటైన తరువాత మేడ్చల్-మల్కాజిగిరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. మల్కాజిగిరి, కీసర రెవెన్యూ డివిజన్లు. అనుబంధ గ్రామాలుగా ఉన్న బాబాగూడ, మురహరిపల్లి, నాగిశెట్టిపల్లి, లింగాపూర్తండా, లింగాపూర్, రాజబొల్లారం, సైదోనిగడ్డ, కోనాయిపల్లి, మైసిరెడ్డిపల్లి, కరీంగూడ, నర్సంపల్లిని నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. నూతన మండలాలుగా మూడుచింతలపల్లి, మేడిపల్లి, గండిమైసమ్మ(దుండిగల్), కాప్రా, అల్వాల్,బాచుపల్లి, కూకట్పల్లిలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రజలకు సుస్థిరమైన పాలన
కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ప్రజలకు సుస్థిరమైన పరిపాలనను అందించే దిశగా మార్గం సుగమమైంది. దీనికి తోడు పని విధానం విభజించడంతో ప్రజలందరికి చేరువలో సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలకు మోక్షం లభించింది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వెంటనే అందించడానికి వీలుగా ఉంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను లబ్ధిదారులందరికి సకాలంలో ఇచ్చేందుకు జిల్లాల ఏర్పాటుతో సాధ్యమైంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాన్ని అందుకుంటున్నారు. ఫలితంగా పారదర్శకమైన పరిపాలన అందడమే కారణం.
రాష్ట్ర కల్చరల్ విభాగం ప్రతినిధి స్థానికతకు ప్రాధాన్యత పెరిగింది
దశాబ్దాలుగా జిల్లా కేంద్రంగా ఉన్న నగరం మాత్రమే అభివృద్ధి చెందేది. మిగతా పట్టణాలు వనరులు ఉన్నా ద్వితీయ శ్రేణిగా పరిగణింపబడేవి. కొత్త జిల్లాల ఏర్పాటుతో మరిన్ని పట్టణాల హోదా పెరిగింది. ఆయా పట్టణాలు స్థానిక ప్రజలకు రాజకీయంగా ప్రాధాన్యత పెరిగింది. గతంలో జిల్లా విస్తీర్ణం ఎక్కువ , సిబ్బంది తక్కువగా ఉండేవారు. ప్రస్తుతం కొత్త కలెక్టరేట్లు ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనాల్లో పాలన అందుతోంది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఒకే చోటు నుంచి పనిచేయడం వల్ల సమన్వయం పెరిగి ప్రజలకు మెరుగైన పాలన అందుతోంది. రెవెన్యూ, భూ సంబంధ, అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాగా మెరుగుపడింది.
– పోలేపల్లి వెంకట్రెడ్డి, రైతు సంఘం నాయకుడు, జగద్గిరిగుట్ట
సకాలంలో పనులు అవుతున్నాయి..
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆధునీకరణ సాధ్యమైంది. అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులపై క్షుణ్ణంగా అధ్యయనం చేయగలుగుతున్నారు. ప్రభుత్వం, ప్రజలకు నడుమ కొత్త కలెక్టరేట్లు, అధికారులు వారధులుగా పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల ఏర్పాటుకు మెరుగ్గా పనిచేస్తున్నారు. రైతులు, వ్యాపార వర్గాలకు తమ అనుమతులు, సమస్యల పరిష్కారానికి సమీకృత కలెక్టరేట్లు దోహదం చేస్తున్నాయి. గతంలో ఒక జిల్లాలో పనిచేసే అధికారి మరోచోట ఇన్చార్జిగా ఉండటం జిల్లా మెత్తానికి న్యాయం చేసే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం తగినంత సిబ్బంది డిజిటలైజేషన్తో ప్రజలకు సకాలంలో పనులు చేయగలుగుతున్నారు.
– భవానీ, విశ్రాంత ఉపాధ్యాయురాలు, కుత్బుల్లాపూర్
పరిపాలనా సౌలభ్యం..
జిల్లాల పునర్విభజనతో ఏర్పడిన చిన్న జిల్లాలతో పరిపాలన సులభమైంది. పనులు త్వరగా అవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు చేరుతున్నాయి. రంగారెడ్డి ఉన్న సమయంలో ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. కలెక్టరేట్కు వెళ్లాలంటే కొంత మంది వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. జిల్లా స్థాయిలో బదిలీలు జరగడం వల్ల కూడా ఉద్యోగులకు నష్టం లేదు. గతంలో మేడ్చల్ నుంచి పరిగి, వికారాబాద్, తాండూరు తదితర ప్రాంతాలకు వెళ్లడం చాలా కష్టంగా ఉండేది.
చిన్న జిల్లాల ఏర్పాటుతో అందరికి మేలు జరిగింది. ప్రజలు, ఉద్యోగులకు సమయభావం తగ్గింది. అధికారులకు పర్యవేక్షణ సులభమైంది. పెద్ద జిల్లాలు ఉన్నప్పుడు ఒక మండలం, ఒక గ్రామానికి జిల్లా కలెక్టర్ ఏడాదికి ఒక్కసారి వస్తే మహా ఎక్కువ. ఇప్పుడు కలెక్టర్ గాని, ఉన్నతాధికారులు గాని ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు అధికారులు, ప్రజలు దూరంగా ఉన్న కలెక్టరేట్కు వెళ్లాలాంటే ఖర్చు ఎక్కువ చేయాల్సి వచ్చేది. సమయం కూడా బాగా తీసుకునేది. చిన్న జిల్లాల ఏర్పాటు సీఎం కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయం.
చిన్న జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. విద్యా, వైద్యం తదితర సౌకర్యాల కల్పన కూడా సులభతరమైంది. శాంతిభద్రతల పరిరక్షణ సులభతరమైంది. ప్రజలకు దూర భారం తగ్గింది. అధికారులు, ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పనులు తొందరగా జరుగుతున్నాయి. ఇలా చిన్న జిల్లాల ఏర్పాటు ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నాయి.
-పీవీ రమణారావు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, నాగారం
సీఎం కేసీఆర్ తీసుకున్న మంచి నిర్ణయం
చిన్న జిల్లాల ఏర్పాటు సీఎం కేసీఆర్ తీసుకున్న మంచి నిర్ణయం. చిన్న జిల్లాలతో పరిపాలన సౌలభ్యంగా మారింది. ఒకప్పుడు కలెక్టర్ను చూడాలంటే సంవత్సరం పట్టేది. ఇప్పుడు కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతున్నాయి. సమీకృత కలెక్టరేట్లో అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేయడంతో ప్రజలకు చాలా మేలు జరిగింది. రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు నగరంలో ఉన్న కలెక్టరేట్కు వెళ్లాలంటే ఒక రోజు పట్టేది. ఇప్పుడైతే మేడ్చల్ నుంచి 15 నిమిషాల్లో కలెక్టరేట్లో ఉండగలుగుతున్నాం.
– సంజీవరావు, తెలంగాణ ఉద్యమకారుడు, మేడ్చల్
కొత్త జిల్లాలతోనే సాధ్యమైంది..
మెరుగైన సంక్షేమం కోసం చిన్న రాష్ర్టాలు కావాలని కోరుకున్న తెలంగాణలో గొప్ప ఫలితాలు చూస్తున్నాం. క్షేత్రస్థాయిలోని ప్రజలకు పాలనా సౌకర్యం కొత్త జిల్లాలతోనే సాధ్యమవుతోంది. గతంలో జిల్లా కేంద్రం నుంచి చివరి ప్రాంతాలకు చేరుకునేందుకు అధికారులకు తగినంత సమ యం ఉండేది కాదు. పర్యవేక్షణ లేక ఆయా ప్రాంతీయ అధికారుల నివేదికలపై ఆధారపడి పాలన సాగేది. అలాగే సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయానికి ప్రజలు రావడం ఇబ్బందిగా ఉండేది. వచ్చినా అధికారులు అందుబాటులో లేనప్పుడు మళ్లీ మళ్లీ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో పనులు సకాలంలో పూర్తవుతున్నాయి.