మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 17 : శాసనసభ ఎన్నికల్లో సెక్టోరియల్ అధికారులు ప్రముఖప్రాత పోషించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారులుతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన సెక్టోరియల్ అధికారులతోపాటు ప్రతి నియోజకవర్గానికి చెందిన పది మంది చొప్పున మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల విధులపై శిక్షణ ఇచ్చామన్నారు. అనంతరం ఈవీఎంలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కేశురామ్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణారెడ్డి, జడ్పీ సీఈఓ దేవసహాయం, జిల్లా స్థాయి ఎన్నికల శిక్షకులు తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 16 విభాగాలకు ప్రత్యేకంగా 22 మంది నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించేందుకు సర్వేలైన్స్, ఫ్లయింగ్ స్కాడ్, వీడియో సర్వేలైన్స్ బృందాలను, ఎంసీఎంసీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు 1950 టోల్ ఫ్రీ నంబర్, సీ-విజల్ యాప్ ద్వారా ఫిర్యాదులను చేయవచ్చన్నారు. శాంతిభద్రతలకు ఇబ్బందులు కలుగకుండా అనుమతులు పారదర్శకంగా జారీ చేస్తారని వివరించారు.