మేడ్చల్ కలెక్టరేట్, మే 1 : మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యా అన్నా రు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ భవిషత్ యువతపై ఉందని వారు సక్రమ మార్గంలో పయనించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని, అందుకు ఎలాంటి దురలవాట్లకు లోనుకాకుండా ఉండాలని అన్నారు. ప్రస్తుతం సమాజాన్ని అల్కహాల్, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు పట్టి పీడిస్తున్నాయని, వాటికి దూరంగా ఉండేలా యువత, పెద్దలు కృషి చేయాలని చెప్పారు.
విద్యార్థులు, యువత ఉన్నత లక్ష్యంతో వెళ్తున్న క్రమంలో ఏ మాత్రం పెడదారిన పడినా వారి జీవితాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, తల్లిదండ్రులు గుర్తించి వారిని సక్రమ మార్గంలోకి తేవాలని సూచించారు. మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉన్నప్పడే నవ సమాజం నిర్మాణమౌతుందని చెప్పారు. జిల్లాలో మాదకద్రవ్యాల వాడకం నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందించేయడం జరుగుతుందని, పూర్తి స్థాయిలో మత్తు పదార్థాలు మానేసి కొత్త జీవితాన్ని ప్రారంభించేలా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.
మహిళల గౌరవానికి భంగం కలగకుండా వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఆయన అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం మహిళలు పనిచేసే స్థలంలో వారిపై లైగింక వేధింపులు నివారణ, నిషేదం, పరిష్కర చట్ట 2013పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు పని చేసే ప్రదేశంలో వారిని గౌరవించడంతో పాటు స్వేచ్ఛ, మర్యాదలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా, వారి హక్కులను పరిరక్షించడానికి కృషి చేయాలని అన్నారు. మహిళలు పని చేసే ప్రదేశంలో ఇంటర్నల్ కంప్లెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని, అన్ని కార్యాలయల్లో ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించాలని సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి అక్కేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.