మేడ్చల్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షం కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిచర్యలు చేపట్టారు. కంట్రోల్ రూమ్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ వెల్లడించారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో.. ఆయన మాటల్లోనే..
ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను రెడ్ జోన్గా ప్రకటించారు. వర్షం కారణంగా ఏర్పడే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశాం. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, చెరువులు, నీరు నిలిచే ప్రాంతాలలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నాం. నీరు ప్రవహించే వంతెనలు, రోడ్ల వద్ద జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం. పురాతన ఇండ్లలో నివాసముంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశాం. 9492409781 నంబర్కు సమాచారం అందిస్తే జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీవోలు, తాశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సమస్యలను పరిష్కరిస్తారు. జిల్లా వ్యాప్తంగా రవాణ సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు లేవు.
సాగు విస్తీర్ణం మరింత పేరిగే అవకాశం
జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వానాకాలం పంటల సాగులో ఎలాంటి ఇబ్బందులు లేవు. కురుస్తున్న వర్షాల వల్ల సాగు విస్తీర్ణం మరింత పేరిగే అవకాశం ఉంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 220 మిల్లీమీటర్లు ఉండగా ఇప్పుడు 302 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై 37 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. వానాకాలం సీజన్లో పంటల సాగు వ్యవసాయశాఖ ప్రణాళిక మేరకు జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పంటలు 28.993 ఎకరాలలో సాగు చేయాల్సి ఉంది. వర్షాలు విస్తారంగా కురిసిన నేపథ్యంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల వైద్యశాఖ అప్రమత్తం
జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ అన్ని చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల వద్ద నివసించే వారికి సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని ప్రాథమిక కేంద్రాలు, ఏరియా దవాఖానల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. జర్వ లక్షణాలు ఉన్నవారు కంట్రోల్రూమ్కు సమాచారం అందిస్తే అవసరమైన చికిత్సలు వైద్యశాఖ సిబ్బంది అందించనున్నారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాం. వైద్య సిబ్బంది 24 గంటల పాటు సేవలు అందిస్తారు. అత్యవసర చికిత్స కోసం 2 అంబులెన్స్లను అందుబాటులో ఉన్నాయి. ఏఎన్ఎంలు, ఆరోగ్యకార్యకర్తలు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు.