సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు యాక్సిండెంట్ ఎనాలసిస్ గ్రూప్(రాగ్)ను ఏర్పాటు చేయడంతో పాటు అర్ధరాత్రి తరువాత డ్రంక్ అండ్ డ్రైవ్ను నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్, జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ, వాటర్ వర్క్స్, ఆర్అండ్బీ, ఆర్టీఏ విభాగాలకు చెందిన అధికారులు ఒక బృందంగా ఏర్పడి రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో 65 బ్లాక్ స్పాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో 98శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని, అందులో వ్యక్తిగతంగా ప్రమాదాలకు గురవుతున్న వారి సంఖ్య 95శాతం వరకు ఉండగా ఇందులో ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్లే ప్రధాన కారణంగా పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి దాటిన తరువాత కూడా డ్రంక్ అండ్ డ్రైవ్, స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది కనీసం 10 శాతం రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో నగర ట్రాఫిక్ పోలీసులు ముందుకు సాగుతున్నారు.
అర్ధరాత్రి తరువాతే ప్రమాదాలు
అర్ధరాత్రి తరువాతే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్లో రాత్రి 11 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ ్రడ్రైవ్లను తగ్గించడం కోసం సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్(డీడీ) చేస్తూనే, అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలున్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్ల పరిసరాలలో ఎక్కువగా ఈ డ్రైవ్ కొనసాగుతుంది.
ప్రమాదాలను కట్టడి చేసేందుకు..
స్వతహాగా చేసే పొరపాట్లతోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. అర్ధరాత్రి సమయంలో ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు రాగ్ను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని విభాగాల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను కట్టడి చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాం.
– ట్రాఫిక్ అదనపు , సుధీర్బాబు