నాంపల్లి కోర్టులు, మార్చి 12 (నమస్తే తెలంగాణ): నకిలీ పాస్పోర్టు కేసులో మీసేవ యజమాని కొప్పిశెట్టి కళ్యాణ్, మారేడ్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న తిప్పన్న, పంజాగుట్ట ట్రాఫిక్ ఏఎస్ఐ షేక్నజీర్ భాషా, వెంకటేశ్వర్లుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. మంగళవారం 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.15వేల చొప్పున ఇద్దరి పూచీకత్తును జమానత్గా కోర్టుకు సమర్పించాలని, ప్రతి శుక్రవారం సీఐడీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. కస్టడీలో నలుగురు నిందితులు తెలిపిన వివరాల ప్రకారం.. అధికారులు చెన్నైకు పయనమయ్యారు. ఈ కేసుతో సంబంధమున్న మరికొందరిని అదుపులోకి తీసుకోనున్నారు.
ప్రధాన నిందితుడు సత్తార్తో ఏర్పడిన పరిచయాల వల్ల శ్రీలంక జాతీయులకు భారత పాస్పోర్టులను తయారు చేసి విదేశాలకు పంపించారు. పాస్పోర్టులను రూపొందించేందుకు నకిలీ పత్రాలను, నకిలీ చిరునామాలతో నకిలీ సర్టిఫికెట్లను తయారు చేశారు. నకిలీ పాస్పోర్టులను పొందిన 100 మంది శ్రీలంకకు చెందిన వారు విదేశాల్లో ఉన్నారు. వారందరి జాబితాను సేకరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 23వ నిందితుడి వరకు అందరూ బెయిల్పై విడుదలయ్యారు.