GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ సర్వసభ సమావేశ ఏర్పాటుపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వేదికైన కౌన్సిల్ను ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన ఉన్నా గడిచిన ఐదున్నర నెలలుగా నిర్వహించలేదు. తొలుత అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా వీలు కాలేదు. గడిచిన రెండు నెలలుగా కౌన్సిల్ ఏర్పాటుకు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ప్రభుత్వ నోటీసులో పెట్టి సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉన్నా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. పలుమార్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించినా కమిషనర్ స్పందించలేదు. బీజేపీ కార్పొరేటర్లూ కమిషనర్ను కలిసే ప్రయత్నం చేసినా వారికి సమయం ఇవ్వలేదు. దీంతో కౌన్సిల్ ఏర్పాటులో ఆలస్యానికి కమిషనర్ వైఖరే కారణమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీఎం రేవంత్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మరోపక్క బీజేపీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయస్థానంలో సోమవారం పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాదులు కృష్ణారెడ్డి, రవీందర్రెడ్డి కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. జాప్యమెందుకు జరిగింది? కౌన్సిల్ను రద్దు చేస్తే సరిపోతుంది కదా? అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సమగ్ర వివరాలతో రావాలని ఈ నెల 12వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.
కౌన్సిల్ ఏర్పాటు కోసం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రత్యేక చొరవ తీసుకొని సమావేశాన్ని నిర్వహించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ మేరకు సోమవారం జీహెచ్ఎంసీ సెక్రటరీ లక్ష్మిని మేయర్ పిలిపించుకుని కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. దీంతో మంగళవారం ఉదయం 11.30 గంటలకు అన్ని పార్టీల కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్ అధ్యక్షతన జరిగే ఆఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల నుంచి ప్రశ్నలు, సమావేశ ఏర్పాటు తేదీ, ఏ ఏ సమస్యలపై చర్చించాలన్న అంశంపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఏర్పాటు చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.