అధికారులు అప్రమత్తంగా ఉండాలి
టెలీకాన్ఫరెన్స్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : వానాకాలంలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జోనల్, అడిషనల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులతో మేయర్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలని, నాలాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాలు పడుతున్నా.. ఎస్ఎన్డీపీ పనులు కొనసాగించేందుకు విభాగాల అధికారుల సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మాన్సూన్ యాక్షన్ టీమ్లు అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉండి ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
ఈ నేపథ్యంలో ట్విటర్, ఫోన్ కాల్స్, ప్రజా ఫిర్యాదులు స్వీకరించి సమస్యను సత్వరమే పరిషరించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్య ఏర్పడినప్పుడు కావాల్సిన పునరావాస చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లల్లో ప్రవేశించిన నీటిని తొలగించేందుకు పరికరాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వానాకాలంలో జోనల్ స్థాయిలో హెల్ప్ లైన్ (కంట్రోల్ రూం) ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.