మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా నగరంలో చేపడుతున్న పారిశుధ్య నిర్వహణ పనులపై మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆకస్మిక పర్యటనలు కొనసాగుతున్నాయి. చార్మినార్, ఖైరతాబాద్ జోన్లలో ఆదివారం పర్యటించిన మేయర్, సోమవారం సికింద్రాబాద్ జోన్లోని పలు ప్రాంతాలలో పర్యటన కొనసాగించారు. ముషీరాబాద్, పార్శిగుట్ట, దేవునితోట, వీఎస్టీ, రాంనగర్, భోలక్పూర్, కవాడిగూడ, సీతాఫల్మండి, బేగంపేట, కాచిగూడ డివిజన్లలో సందర్శించిన మేయర్ అనేక చోట్ల చెత్త పేరుకుపోవడం పట్ల అధికారుల నుంచి వివరణ కోరారు. స్థానిక ప్రజలు రాత్రికి రాత్రి చెత్త వేస్తున్నారని అధికారులు మేయర్కు వివరించారు. సంబంధిత ప్రాంతాలలో చెత్త వేయనీయకుండా ఒక మనిషిని పెట్టి ఆయా ప్రదేశాలలో చెట్లు నాటించాలని, కుదరని చోట్ల పచ్చగుడ్డలతో కవర్ చేసి ఒక్కరూ కూడా తిరిగి చెత్త వేయకుండా చూడాలని అధికారులకు మేయర్ సూచించారు.
పారిశుధ్య కార్యక్రమాలపై మేయర్ విజయలక్ష్మిని ఫోన్ ద్వారా మంత్రి కేటీఆర్ వివరాలడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లోనూ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ కూడా చెత్త పేరుకుపోకుండా చూడాలని మేయర్కు సూచించారు. జీహెచ్ఎంసీకి ఎటువంటి మద్దతు కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు.