సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ) : సరూర్నగర్, నాగోల్ ప్రాంతాల్లోని కాలనీలకు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన గడ్డి అన్నారం, నాగోల్ పరిసర ప్రాంతాల్లో మేయర్ విజయలక్ష్మి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, అరుణ, జీహెచ్ఎంసీ ఇంజినీర్లతో కలిసి మేయర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
భారీ వర్షాల వల్ల సరూర్నగర్ చెరువుకు అధిక పరిమాణంలో వచ్చే వర్షపు నీటిని బయటకు విడుదల చేసిన సందర్భంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా అదనపు బాక్స్ డ్రైన్లను నిర్మించనున్నట్లు వివరించారు. సరూర్నగర్ చెరువు నుంచి విడుదలయ్యే నీరు వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న రెండు డ్రయిన్లు సరిపోవడం లేదని, సరూర్నగర్ పరీవాహక ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీటి పరిమాణాన్ని విడుదలజేసే నీటి మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని ఇంజినీర్లు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అదనంగా ఐదు బాక్స్ డ్రైన్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
శాశ్వత పరిష్కారానికి చేపట్టే ఈ బాక్స్ డ్రైన్ల నిర్మాణాలకు మరో వారం రోజుల్లోగా టెండర్లు పిలువాలని ఆదేశాలు జారీ చేశారు. బాక్స్ డ్రైన్ల నిర్మాణం, వాటి వైశాల్యం, నిర్మాణం జరిగే మార్గాలు, సాంకేతిక అంశాలను కార్పొరేటర్ బద్ద ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, కాలనీవాసులకు వివరించారు. ఈ సందర్భంగా గడ్డి అన్నారం వార్డులోని వివిధ కాలనీల ప్రతినిధుల సందేహాలను ఇంజినీర్లు నివృత్తి చేశారు. అనంతరం నాగోల్ అయ్యప్పకాలనీ, పరిసర కాలనీలు ముంపునకు గురికాకుండా చేపట్టనున్న బాక్స్ డ్రైన్ పనుల గుర్తించి మేయర్కు నాగోల్ కార్పొరేటర్ అరుణ వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఎన్డీపీ విభాగం చీఫ్ ఇంజినీర్ వసంత, లేక్స్ విభాగం ఓఎస్డీ సురేశ్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు