సిటీబ్యూరో: నగరంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా తాగునీటి సరఫరా చేయాలని అధికారులను ఎంఏయూడీ చీఫ్ సెక్రెటరీ దానకిశోర్ ఆదేశించారు. వాటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో తాగునీటి వసతులపై శనివారం ఆయన సమీక్షించారు. సెక్షన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్, డెలివరీ, లైన్మెన్ల పనితీరుపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ఉండే లైన్మెన్ల పనితీరును పర్యవేక్షించాలని ఆదేశాలిచ్చారు. నీటి సరఫరాలో ఆటంకాలు కల్పిస్తే విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. జల మండలి నాణ్యత యాప్లో నీటి సరఫరా, క్వాలిటీ వివరాలు నమోదు చేయాలన్నారు.
నగర తాగునీటి అవసరాలకు జంట జలాశయాల నుంచి అదనంగా 20 ఎంఎల్డీల నీటిని వాడుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మీరాలం, ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ 100 శాతం పనిచేసేలా మరమ్మతులు చేయాలన్నారు. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఐదు కేఎల్ సామర్థ్యం కలిగిన వంద మినీ ట్యాంకర్లను సమకూర్చుకుంటున్నట్లుగా తెలిపారు. వీటితో పాటు 2.5 కేఎల్ సామర్థ్యం కలిగిన 75 మినీ ట్యాంకర్లు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ ట్యాంకర్లతో డెలివరీ సమయాన్ని 12 గంటలకు తగ్గించాలన్నారు. అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నాగార్జునసాగర్లో ఎమర్జెన్సీ పంపింగ్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డితో పాటు ఈడీ సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్-2 స్వామి, సీజీఎం, జీఎం, మేనేజర్లు పాల్గొన్నారు.