వికారాబాద్, అక్టోబర్ 16 : జిల్లాలో మున్సిపల్ పరిధిలో డ్రోన్తో సర్వే చేసి మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తునట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్, మున్సిపల్ అధికారులు, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, డీటీసీపీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్కు పూజ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీకి సమస్యలు లేని మాస్టర్ ప్లాన్ తయారవుతున్నదని, భవిష్యత్ తరాలకు అన్ని డిజిటలైజ్ చేయడమే లక్ష్యమన్నారు. లేటెస్ట్ టెక్నాలజీ, డ్రోన్ కెమెరాల సాయంతో వికారాబాద్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వే పకడ్బందీగా క్యాప్చర్ చేయడం జరుగుతున్నదని, కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 స్కీమ్ కింద రాష్ట్రంలో 50వేల నుంచి లక్ష జనాభా కలిగిన 20 మున్సిపాలిటీలను మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వే చేయడం కోసం సెలెక్ట్ చేసినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి వికారాబాద్ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ సర్వే సాయంతో వికారాబాద్ పట్టణం అభివృద్ధి చెందుతుందని, చాల ఏండ్ల కింద రూపొందించిన ప్రణాళికలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా మార్చేందుకు ఈ డిజిటల్ సర్వే ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే ఉపగ్రహాల సాయంతో మున్సిపాలిటీల పరిధిలోని ప్రాంతాల వారీగా ఉపరితలం ఎత్తు, పరిస్థితులు, రోడ్లు, ఇండ్లు, డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు, సెల్ టవర్స్, టాయిలెట్స్, రిజర్వాయర్లు, మార్కెట్లు, వైకుంఠధామాలు ఇలా ప్రతిదీ చిత్రాలతో విభాగాల వారీగా సేకరించి బేస్ మ్యాప్లను తయారు చేస్తారన్నారు.
దీన్ని ఆధారం చేసుకుని రాబోయే 30, 40 సంవత్సరాల భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు అధికార యంత్రాంగం కొత్త మాస్టర్ ప్లాన్ను రూపొందించే పనిలో నిమగ్నమైందన్నారు. పట్టణాల అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో ఈ బేస్ మ్యాప్లే కీలకం కానున్నాయన్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశం హాలులో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్, పాల్గొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ డీటీసీపీ రమేశ్ బాబు పీపీటీ ద్వారా డ్రోన్ సర్వేతో ఏ విధంగా డేటా తీసుకోవాలన్న పూర్తి వివరాలను తెలుపుతూ అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, సర్వే ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ భాస్కర్ చంద్ర ఫరీదా, డీటీసీపీ అడిషనల్ డైరెక్టర్ రమేశ్బాబు, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ రాకేశ్రెడ్డి, టీపీవో వేణుగోపాల్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, డీటీపీసీ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.