కుత్బుల్లాపూర్/దుండిగల్, ఏప్రిల్ 9 : మేడ్చల్ జిల్లా , కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గురువారం ఉదయం వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధి, సుభాష్నగర్ డివిజన్, రాంరెడ్డినగర్ సమీపంలోని గంపలబస్తీ ఉన్న సలీం అనే నిర్వాహకుడికి చెందిన కెమికల్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంతో చెలరేగిన మంటలతో పక్కనే ఉన్న మరో మూడు కెమికల్ గోదాంలకు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. కెమికల్ డ్రమ్ములతో పాటు మెడికల్ స్క్రాబ్ గోదాములో చెలరేగిన మంటలతో నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది.
డెకరేషన్ గోదాంలో..
బహదూర్పల్లి గ్రీన్హిల్స్లో చింతల్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్ డెకరేషన్ గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. గోదాంలో ఉన్న టాటాఏసీ గూడ్స్ వాహనంతో పాటు మరో కారు పూర్తిగా అగ్నికి ఆహుతయింది. దీనికి తోడు ఘటనా స్థలానికి ఆనుకొని ఉన్న బహుళ అంతస్తుల ప్రైవేట్ హాస్టల్ భవనంలోకి మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో విద్యార్థుల సామగ్రి దగ్ధమైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దాదాపుగా కోటికి పైగానే ఆస్తినష్టం వాటిల్లిన్నట్లు బాధితుడు వాపోయాడు.
కాగా కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగిరెడ్డితో పాటు జీడిమెట్ల, దుండిగల్ పోలీసులు , జీడిమెట్ల అగ్నిమాపక అధికారులు, డీఆర్ఎఫ్ బృందంతో పాటు ఆరు ఫైర్ఇంజన్లతో ఈ రెండు ప్రాంతాల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆస్తినష్టం భారీగా జరిగినప్పుటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికు లు ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న గోదాములపై అధికారు లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా భద్రతా ప్రమాణాలను పట్టించుకొనే నాథులే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అక్రమ గోదాంలు, కెమికల్ నిర్వహణ వంటి గో దాంలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.