ఖైరతాబాద్, ఏప్రిల్ 20 : టీవీ నటి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పంజాగుట్ట ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… శ్రీనగర్కాలనీలో ఉండే నటి సుమిత్ర పంపనా (56) ఈ నెల 17న ఢిల్లీకి వెళ్తూ ఇంటి తాళాలను అదే అపార్ట్మెంట్లో ఉండే మరదలు భువనేశ్వరికి ఇచ్చి వెళ్లారు. 18న ఇంటి తాళం పగులగొట్టి ఉన్నట్లు ఆమె సోదరుడు గుర్తించి ఆమెకు ఫోన్ చేశాడు.
ఢిల్లీ నుంచి వచ్చి ఫ్లాట్లో చూడగా 1.29 కేజీల బంగారం, వజ్రాభరణాలు, 293 గ్రాముల వెండి ఆభరణాలు కనిపించలేదు. అదే ఫ్లాట్లో భద్రపర్చిన మేనల్లుడివి 137 గ్రాముల బంగారు ఆభరణాలూ అపహరణకు గురయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.