కంటోన్మెంట్/బొల్లారం, మే 15 : దేశంలో బీజేపీకి నూకలు చెల్లాయని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఏడో వార్డు తిరుమలగిరిలో సోమవారం జయలక్ష్మి గార్డెన్స్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డితో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె క్రిషాంక్, గజ్జెల నాగేశ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయమే ఇందుకు నిదర్శనమని తేల్చిచెప్పారు. కంటోన్మెంట్లో నామినేటెడ్ సభ్యుడిగా చెలమణి అవుతున్న వ్యక్తి ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని దుయ్యబట్టారు. గ్యాస్ ధరలను ఆమాంతం పెంచుకుంటూ పోతున్నారని, రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి జనం కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమన్నారు.
అభివృద్ధి జరుగాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా అది బీఆర్ఎస్తోనే సాధ్యం అవుతుందన్నారు. గతంలో కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు 15 రోజులకోసారి తాగునీరు సరఫరా జరిగేదని, మంత్రి కేటీఆర్ చొరవతో కంటోన్మెంట్లో ప్రతిరోజూ తాగునీటి సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఏడో వార్డులోని పెద్ద కమేళా ప్రాంతంలో అద్భుతమైన శ్మశాన వాటికను నిర్మించుకున్నామని చెప్పారు. ఆ పక్కకే ఉన్న సాయిబాబా హాట్స్కు వెళ్లాలంటే మాత్రం డిఫెన్స్ అధికారులు కంచెలు ఏర్పాటు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
కంటోన్మెంట్ గులాబీ జెండా అడ్డా అని…రానున్న బోర్డు, సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథం, నళినికిరణ్, భాగ్యశ్రీ, నేతలు ముప్పిడి మధుకర్, ప్రవీణ్యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మహంకాళి శర్విన్, సురేశ్, సోమయ్య, సుజిత్, అఖిల్, బంటి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి
ఆత్మీయ సమ్మేళనం ద్వారా పార్టీ బస్తీ స్థాయి, వార్డు స్థాయిలో ఉన్న నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లాగా పని చేయాలి. నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం.
– కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిషాంక్
దేశానికే తెలంగాణ ఆదర్శం
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. సీఎం కేసీఆర్ అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఒక్కో నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలను కలిగి ఉన్న బీఆర్ఎస్.. ఎంతో బలమైన శక్తిగా ఉన్నది. రానున్న ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.
– కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
బీఆర్ఎస్కు హ్యాట్రిక్ గెలుపు
దేశ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధే తమ వద్ద కూడా జరగాలని పక్క రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు సోయి తప్పింది. బీజేపీకి ముఖం లేకుండా పోయింది. ఈసారి ఎన్నికల్లో వారికి సింగిల్ డిజిట్ కూడా రాదు. బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయం కట్టబెట్టాలి.
– కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్