కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 13 : టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని.. పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, నాయకులందరికీ తప్పకుండా గుర్తింపు లభిస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ సమన్వయ కర్త మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోనే తిరుగులేని శక్తిగా ఎదగడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి గొప్పదన్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి నేటివరకు కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు గుర్తింపునిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ అధిష్టాన పెద్దల ఆదేశాల మేరకు నియోజకవర్గం పరిధిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ఈనెల 20లోపు అన్ని రకాల కమిటీలను పూర్తిచేసి అధిష్టానంకు అందజేయాలన్నారు. ఈ కమిటీల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే గుర్తింపు ఉంటుందని.. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన పేదలకు అందించేందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కాలనీలు, బస్తీల్లో ప్రజా సమస్యలను గుర్తించి ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, అధికారుల సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు అందించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు.
కాలనీలు, బస్తీల్లో పార్టీ బలోపేతం కోసం పనిచేసిన వారందరికీ తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీషాబాబురావు, సబీహా గౌసుద్దీన్, పండాల సతీశ్ గౌడ్, ముద్దం నర్సింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు పగుడాల బాబురావు, తూము శ్రవణ్కుమార్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.