సిటీబ్యూరో/బేగంపేట, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రూబీ ప్రైడ్ హోటల్ అగ్నిప్రమాద ఘటనకు కారణమైన నలుగురిని బుధవారం మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్జోన్ డీసీపీ చందనా దీప్తి కథనం ప్రకారం.. కార్ఖానకు చెందిన రంజిత్సింగ్ భవనంలో అతడి ఇద్దరు కుమారులు సునీత్సింగ్, సుప్రీత్ సింగ్లో ఒకరు ఈ బైక్ షోరూం, మరొకరు హోటల్ వ్యాపారం చేస్తున్నారు. రుబీ హోటల్ మేనేజర్గా సుదర్శన్ నాయుడు, రూబీ ఎలక్ట్రిక్ మోటర్స్లో క్యాషియర్గా జస్పాల్ సింగ్ పని చేస్తున్నారు. సోమవారం రాత్రి ఈబైక్ చార్జింగ్తో మొదలైన అగ్నిప్రమాదం సెల్లార్ అంతటా వ్యాపించి, పైన ఉన్న లాడ్జిలోకి కూడా మంటలు, పొగ వ్యాపించింది. ఈ ప్రమాదంలో పొగ పూర్తిగా కమ్ముకోవడంతో 8 మంది మృతి చెందగా.. 11 మందికి గాయాలయ్యాయి.
హోటల్ గదుల్లో ఉన్న ఏడుగురు కిటికీలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. పోలీసులు, ఫైర్, స్థానికుల సహకారంతో 17 మందిని కాపాడి, గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం దవాఖానలకు తరలించారు. సెల్లార్లో ఉన్న 28 ఈ-బైకులు, 8 పెట్రోల్ బైకులు, జనరేటర్, ఓపెన్ బ్యాటరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని, దీనిపై 304 పార్ట్-2, 324 ఐపీసీ అండ్ సెక్షన్ 9(బి) ఆఫ్ ఎక్స్ ప్లోజివ్ చట్టాల కింద కేసు నమోదు చేసి, నలుగురిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. ప్రమాదం జరిగిన భవనంలో ఉన్న సీసీ కెమెరాలను విశ్లేషించామని, ఈ-బైక్ చార్జింగ్ పెట్టిన ప్రదేశం నుంచే మంటలు వచ్చాయని, ఫైర్, విద్యుత్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుల ఆధారంగానే ఈ ప్రమాదానికి గల కారణాలను స్పష్టంగా చెప్పేందుకు అవకాశం ఉంటుందన్నారు. నిందితులు వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పార్కింగ్ చేయాల్సిన సెల్లార్లో వ్యాపారం చేస్తున్నారని డీసీపీ వెల్లడించారు. మార్కెట్ పోలీసులు వేగంగా స్పందించారంటూ సిబ్బందిని అభినందించారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఘటనా స్థలంలో వేడి ఎక్కువగా ఉండటంతో ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించేందుకు తగిన నమూనాలను సేకరించలేదని, బుధవారం ఘటనా స్థలం నుంచి పలు శాంపిల్స్ను పోలీసులు సేకరించి ఎఫ్ఎస్ఎల్ పరీక్షలకు పంపించినట్లు చెప్పారు.