హైదరాబాద్ : మారేడుపల్లి సీఐ నాగేశ్వర్ రావు సస్పెండ్ అయ్యారు. అత్యాచారం, ఆయుధ చట్టం కింద సీఐ నాగేశ్వర్ రావుపై కేసు నమోదైనట్లు రాచకొండ సీపీ నుంచి హైదరాబాద్ సీపీ కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో నాగేశ్వర్ రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీదు, బోనాల పండుగ బందోబస్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుపల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియమించారు. బాధితురాలి భర్తపై కూడా సీఐ నాగేశ్వర్ రావు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మారేడుపల్లి సీఐ నాగేశ్వర్ రావుపై అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణలతో కేసు నమోదైన సంగతి తెలిసిందే. సీఐ నాగేశ్వర్ రావును వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళ్తే.. నాగేశ్వర్ రావు ఈ నెల 7వ తేదీన హస్తినాపురం శ్రీ వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ ఇంటికి వెళ్లాడు. రాత్రి సమయంలో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే వారి ఇంట్లోకి సీఐ ప్రవేశించాడు. భర్త తిరిగొచ్చే వరకు భార్యపై సీఐ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన భార్యపై అత్యాచారం చేస్తున్న సీఐని అడ్డుకున్నాడు. దీంతో బాధితురాలి భర్తను సీఐ రివాల్వర్తో బెదిరించాడు. అర్ధరాత్రి సమయంలో ఆ దంపతులిద్దరిని కారులో ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం వైపు బయల్దేరాడు. అయితే కారు రోడ్డుప్రమాదానికి గురవడంతో.. సీఐ నుంచి దంపతులిద్దరూ తప్పించుకుని, వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ నాగేశ్వర్ రావును వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.