సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో ‘సీటుకు నోటు’ వ్యవహారం మరింత ముదురుతున్నది. ‘మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ కావాలంటే 5 ఎకరాలు..10 కోట్లు ఇచ్చుకోవాల్సిందే’ అంటూ సంచలనం సృష్టించిన అంశం పార్టీ అధిష్ఠానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ముఖ్యంగా మహేశ్వరంతో పాటు రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం భూములు, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయనే వివరాలు ఒక్కొక్కటిగా బయటికొస్తుండటం ఆ పార్టీ నేతల్లో కలకలం సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో నిజాయితీని నిరూపించుకోవాల్సిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మొహం చాటేస్తుండటం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లోనూ అనేక అనుమానాలకు తావిస్తున్నది. బీజేపీ నేత ఈటల రాజేందర్ గతంలో ఆరోపణ చేసినప్పుడు ఎవరూ అడగకుండానే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ నేతలే బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నా మిన్నకుండటంతో ఆ పార్టీ నేతలే కొందరు ‘దాల్ మే కుచ్ కాలా హై’ అని ముక్కున వేలేసుకుంటున్నారు.
మహేశ్వరం కాంగ్రెస్ టికెట్కు ఐదెకరాలు… రూ.10 కోట్లు’ అంశం ఆ పార్టీ అధిష్ఠానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. నిజాయతీ నిరూపించుకోవాల్సిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ముఖం చాటేస్తుండటం ఆ పార్టీ శ్రేణుల్లోనూ అనుమానాలకు తావిస్తున్నది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం భూములు, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయనే వివరాలు ఒక్కొక్కటీగా బయటికొస్తుండటం ఆ పార్టీ నేతల్లో కలకలం సృష్టిస్తున్నది. గతంలో మునుగోడు ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా రూ.25 కోట్లు తీసుకున్నాడంటూ రేవంత్ను తూర్పారబట్టారు. దీంతో రేవంత్రెడ్డి చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లి నానా హంగామా చేశారు. తాను రూ.25 కోట్లు తీసుకోలేదని అమ్మవారి ముందు ప్రమాణం చేశారు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసం ‘ఐదెకరాలు, రూ.10 కోట్లు’ చేతులు మారాయనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
డీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్మీట్లోనే నియోజకవర్గ నాయకుడు, మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న కొత్త మనోహర్రెడ్డి ఈ సంచలన ఆరోపణ చేశారు. చిగురింత నర్సింహారెడ్డి స్వయంగా తాను రేవంత్కు భూమి, డబ్బులిచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని కుండబద్దలు కొట్టారు. దీంతో ఉలిక్కిపడిన కాంగ్రెస్ హైకమాండ్.. నష్ట నివారణ చర్యల్లో భాగంగా మనోహర్రెడ్డిని సస్పెండ్ చేసింది. దీంతో గతంలో మాదిరిగా రేవంత్రెడ్డి భాగ్మలక్ష్మి అమ్మ వారి ముందు ప్రమాణం చేసి, తన నిజాయతీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ రేవంత్ మాత్రం ఈ ఆరోపణలపై స్పందించకపోగా… ఆరోపణ చేసిన మనోహర్రెడ్డిని ఆగమేఘాల మీద పార్టీ నుంచి సస్పెండ్ చేయించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ ఢిల్లీలో ఇదే అంశంపై వాకబు చేసినట్లు మనోహర్రెడ్డి గతంలోనే వెల్లడించారు. అంటే పార్టీ సీనియర్ నాయకుల్లోనూ ఇవే అనుమానాలు ఉన్నాయని అర్థమవుతున్నది. అయినా… రేవంత్ మాత్రం దీనిపై స్పందించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సీటుకు నోటు వ్యవహారంలో..
సీటుకు నోటు వ్యవహారంలో భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద నిజాయతీని నిరూపించుకోవాలని కొత్త మనోహర్రెడ్డి, రేవంత్రెడ్డికి సవాల్ విసరగా… డబ్బులు ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చిగురింత నర్సింహారెడ్డి సతీమణి, బడంగ్పేట మేయర్ చిగురింత పారిజాత శనివారం ప్రెస్మీట్ నిర్వహించడంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది. రేవంత్పై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ప్రెస్మీట్ నిర్వహిద్దామంటూ తాను డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డితో పాటు టికెట్ ఆశిస్తున్న కీలక నాయకులకు ఫోన్ చేసి కోరానని, కానీ ఆయన మాత్రం అందుకు నిరాకరించినట్లు ఆమె స్వయంగా వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడికి టికెట్ కోసం డబ్బులిచ్చిన ఆరోపణలను ఖండించేందుకు డీసీసీ అధ్యక్షుడితో పాటు ఇతర కీలక నేతలు ఆమెతో కలిసి ప్రెస్మీట్లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాణం చేయడానికి ఎక్కడైనా సిద్ధమే ; కొత్త మనోహర్రెడ్డి
బడంగ్పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ప్రెస్మీట్ నిర్వహించిన వెంటనే బహిష్కృత నేత మనోహర్రెడ్డి కూడా ప్రెస్ మీట్ నిర్వహించడంతో కాంగ్రెస్లో ‘సీటుకు నోటు’ వ్యవహారం మరింత వేడెక్కినట్లయింది. భాగ్యలక్ష్మి ఆలయం కాకుండా మహేశ్వరంలోని శివగంగ ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి రావాలంటూ పారిజాత, కొత్త మనోహర్రెడ్డిని డిమాండ్ చేయగా… తాను సిద్ధమేనని కొత్త మనోహర్రెడ్డి ప్రకటించారు. కాకపోతే… పారిజాతతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఆమె భర్త నర్సింహారెడ్డి కూడా వస్తే నలుగురం కలిసి ప్రమాణం చేద్దామంటూ ప్రతి సవాల్ విసిరారు. ముఖ్యంగా డబ్బులు ఇచ్చిన వారితో పాటు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్రెడ్డి కూడా వస్తే రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చినట్లవుతుందని, రేవంత్రెడ్డి కూడా తన నిజాయతీని నిరూపించుకోవచ్చని మనోహర్రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం శివగంగ ఆలయం వద్ద ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతున్నది.