ఖైరతాబాద్, జూలై 29: ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ మౌనం వీడాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామన్నారని, రెండోసారి వచ్చిన తర్వాత కూడా ఆ అంశాన్ని పక్కన పెట్టారన్నారు.
తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ వర్గీకరణ పేరుతో మరోసారి మభ్యపెట్టారన్నారు. మందకృష్ణ మాదిగ బీజేపీకి మాదిగల ఓట్లు వేయించారని, వారి ఓట్లతోనే రాష్ట్రంలో ఎనిమిది సీట్లు గెలిచిందన్నారు. ప్రస్తుతం, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో వర్గీకరణ బిల్లును ఎందుకు పెట్టడం లేదన్నారు.
మాదిగల ఓట్లు వేయించుకున్న ఇక్కడి బీజేపీ ఎంపీలు సైతం మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లోపు వర్గీకరణ బిల్లు పెట్టకుంటే ఆగస్టు 8, 9 తేదీల్లో జంతర్ మంతర్ వేదికగా, పెద్ద ఎత్తున మాదిగలతో కలిసి మహాధర్నా, నిరసనలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను ఆహ్వానిస్తామన్నారు.
సమావేశంలో మాదిగ రాజకీయ పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఒక్కలగడ్డ చంద్రశేఖర్, జాతీయ దళిత సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బుదాల బాబురావు, మాదిగ రాజకీయ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బీఎన్ రమేశ్, మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్నీ, మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య, తెలంగాణ దళిత దండు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొగులయ్య, బీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేశ్, మాదిగ జేఏసీ యూత్ అధ్యక్షులు మహేశ్, విజయలక్ష్మి, సముద్రాల ప్రశాంత్, దేవరకొండ నరేశ్, జోగు గణేశ్, లింగంపల్లి మధుకర్, కృష్ణ పాల్గొన్నారు.