హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు- మనబడి, మన బస్తీ -మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తలసాని అన్నారు. శుక్రవారం బన్సీలాల్ పేట డివిజన్ పద్మారావు నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.19 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులతో ముచ్చటించారు.
పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా ? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?, పాఠాలు మంచిగా చెబుతున్నారా అని పలు ప్రశ్నలు వేసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాబోధన అందుతున్న తీరు గురించి విద్యార్ధులు, ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరని, 5 తరగతులకు గాను కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని మంత్రికి వివరించారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు తీసుకోవాలని డీఈవో రోహిణి ని మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా పాఠశాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సిబ్బంది కొరతకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలను గుర్తించి 7,289.54 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ జిల్లాలో 499 ప్రాథమిక, 9 ప్రాథమికోన్నత, 182 ఉన్నత పాఠశాలల ను కలుపుకొని 690 పాఠశాలలు ఉండగా.. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 239 పాఠశాలలను అభివృద్ధి పనులు చేపట్టేందుకు మొదటి దశలో ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, పద్మారావు నగర్ టీఆర్ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఏఈ షఫీ, డిప్యూటీ డీఈవో సామేల్ రాజ్, శ్రీనివాస్ రాజు, డీఈ సంజీవ, ఏఈ శ్రవణ్, కో ఆప్షన్ సభ్యులు బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.